జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు
కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేయెద్దని భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ నిర్వాహకులను ఆదేశించారు.బుధవారం మండలంలోని రుద్రారం,ఎడ్లపల్లి,కొయ్యూరు,కొండంపేట,వల్లంకుంట,తాడిచర్ల గ్రామాల్లో పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులకు పలు సూచనలు, ఆదేశాలు చేశారు.కొనుగోలు ప్రక్రియను సమగ్రంగా పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తూ ఎఫ్ఏక్యూ గ్రేడ్ వరి మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశించారు.
తక్కువ ప్రమాణాల ధాన్యాన్ని స్వీకరించరాదని స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాగ్ చేసిన రైస్ మిల్లులకు ఆలస్యం లేకుండా తరలించాలన్నారు.కొనుగోలులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రతి కేంద్రంలో రోజువారీ వరి కొనుగోలు వివరాలు,రైతులకు చెల్లింపుల పురోగతి ట్యాబ్లో ప్రతిరోజూ తప్పనిసరిగా అప్డేట్ చేయాలని ఆదేశించారు.ఆలస్యం లేదా తప్పిదాల కోసం సంబంధిత ఇన్చార్జ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.ప్రతి కేంద్రంలో అధికారిక సమాచారం రోజువారీ కొనుగోలు గణాంకాలు,రేట్లు,రైతుల వివరాలు నోటీసు బోర్డు మీద స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు.
పర్చేజ్ రిజిస్టర్, రైతుల సమాచార రిజిస్టర్లను సక్రమంగా, ప్రతిరోజూ అప్డేట్ చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు.కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు,నీడ,కొలతల యంత్రాలు, పారదర్శక తూకం పరికరాలు వంటి సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కొనుగోలు కార్యక్రమంలో పారదర్శకత, సత్వర స్పందన, రైతులకు సేవాభావం పిపిసీ ఇన్చార్జీల ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు.సందర్శనలో గుర్తించిన చిన్నపాటి లోపాలను తక్షణమే సరిదిద్దాలని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.కేంద్రాల ఇంచార్జిలు కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా బాధ్యతతో సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ అధికారి కిరణ్ కుమార్,డిసిఓ వాల్వ నాయక్,పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,తహశీల్దార్ రవికుమార్, ఏఓ శ్రీజ,ఏఈఓలు పాల్గొన్నారు.



