Monday, June 2, 2025
E-PAPER
Homeజాతీయంమతం ఆధారంగా అక్రమ వలసదారులను గుర్తించొద్దు

మతం ఆధారంగా అక్రమ వలసదారులను గుర్తించొద్దు

- Advertisement -

– మోడీ సర్కార్‌ నిర్ణయం అమానవీయం
– శాంతి భద్రతలను కాపాడటం, చొరబాట్లను నిరోధించడం కేంద్రం విధి
– ఎంపిక చేసిన వర్గాలకు ఆయుధాలు సమకూర్చడం పరిష్కారం కాదు : సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ :
మతం ఆధారంగా అక్రమ వలసదారులను గుర్తించవద్దని సీపీఐ(ఎం) పేర్కొంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ.. శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అనుమానిత బంగ్లాదేశ్‌ పౌరులను దేశం నుంచి గెంటేయాలన్న కేంద్రం నిర్ణయం అమానవీయమని సీపీఐ(ఎం) మండిపడింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా బెంగాలీ మాట్లాడే ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని, ఎలాంటి ధ్రువీకరణ లేకుండా వారిని బంగ్లాదేశ్‌ నెట్టివేశాయని పేర్కొంది. కొంతమంది భారతీయ పౌరులను కూడా అరెస్ట్‌ చేసి బంగ్లాదేశ్‌కు పంపినట్టు నివేదికలు అందాయని తెలిపింది. అస్సాం హైకోర్టు, సుప్రీంకోర్టు ముందు ఉన్న కొన్ని కేసుల విషయంలో.. ఇంకా అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. అయినా వారిని కూడా బలవంతంగా దేశం నుంచి పంపారని, దీనిని అనుమతించకూడదని సీపీఐ(ఎం) ఆ ప్రకటనలో పేర్కొంది. అక్రమ మార్గాల్లో దేశంలోకి ప్రవేశించిన వారికి న్యాయమైన విచారణకు అవకాశం కల్పించాలని, ఎటువంటి దురుద్దేశం లేకుండా దేశంలోకి ప్రవేశించే పేదలు, పత్రాలు లేని వలసదారులను గౌరవంగా చూడాలని, వారిపట్ల చట్టం ప్రకారం వ్యవహరించాలని తెలిపింది. దుర్భలమైన, మారుమూల ప్రాంతాలలో నివసించే స్థానిక ప్రజలకు ఆయుధ లైసెన్సులు ఇచ్చేందుకు బీజేపీ నేతృత్వంలోని అసోం ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన విధానాన్ని సీపీఐ(ఎం) ఆ ప్రకటనలో తప్పుపట్టింది. ఇది చాలా ప్రమాదకరమైన నిర్ణయమని, దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉన్నాయని మండిపడింది. శాంతి భద్రతలను కాపాడటం, చొరబాట్లను నిరోధించడం కేంద్ర ప్రభుత్వం విధి అని, దానిని పక్కకు పెట్టి మతం ఆధారంగా ఎంపిక చేసిన వర్గాలకు ఆయుధాలు సమకూర్చడం పరిష్కారం కాదని పొలిట్‌బ్యూరో తన ప్రకటనలో పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -