నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా జిల్లాలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. బుధవారం రోజు మినీ మీటింగ్ హాల్ లో కలెక్టర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లా లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అన్నారు.
డ్రగ్స్ మూలాలను గుర్తించి, వాటి రవాణా, విక్రయాలు, వినియోగం జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాల గురించి ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, ఎవరు కూడా పెడదోవ పట్టకుండా భావి పౌరుల భవిష్యత్తును కాపాడాలని హితవు పలికారు. ముఖ్యంగా యువత మత్తుపదార్థాల బారిన పడకుండా అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తూ అంకితభావంతో కృషి చేయాలన్నారు. విద్యా సంస్థల్లో మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను బలోపేతం చేసి అవి క్రియాశీలకంగా పని చేసేలా చూడాలన్నారు.
రానున్న రోజుల్లో మాదక ద్రవ్యాల నియంత్రణకు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాలలు, కళాశాలల వద్ద స్థానికంగా ఉండే దుకాణాలపై నిఘా ఉంచాలని సూచించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను తెలిపే సందేశాత్మక వీడియోను అన్ని స్కూళ్ళు, కాలేజీలలో ప్రదర్శించాలని, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తూ ప్రజలను జాగృతం చేయాలన్నారు. గంజాయి, క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్, అల్ఫ్రాజోలం వంటి వాటి రవాణా, విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం ఇవ్వలన్నారు. పాఠశాలలలో, కాలేజీ లలో విద్యార్థులచే మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వలన కలిగే నష్టాలపై పై ప్రతిజ్ఞ చేయించాలన్నారు. ఈ కార్యక్రమం లో అడిషనల్ డిసిపీ లక్ష్మీనారాయణ, రెవిన్యూ డివిజనల్ అధికారికారులు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, అటవీ శాఖ అధికారి పద్మజా, ఎక్సైజ్ సూపర్నెంట్ విష్ణు మూర్తి, జిల్లా సంక్షేమ అధికారి నర్సింగరావు, జిల్లా విద్యా అధికారి సత్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి సునంద సంబంధిత అధికారులు పాల్గొన్నారు.