షట్డౌన్ కారణంగా అందుబాటులో లేని సమాచారం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కలవరపాటు
వాషింగ్టన్/టోక్యో : ప్రభుత్వ షట్డౌన్ నేపథ్యంలో అమెరికాలో ఏం జరుగుతోంది? షట్డౌన్ తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదు. దీంతో జపాన్, ఇతర ప్రపంచ దేశాల నేతలు, ప్రజా ప్రతినిధులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రపంచం లోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో తలెత్తిన షట్డౌన్ కారణంగా అనేక కీలక అంశాలకు సంబంధించిన డేటా అందుబాటులో లేకుండా పోతోంది. ఇది చాలా తీవ్రమైన సమస్య అని బ్యాంక్ ఆఫ్ జపాన్ గవర్నర్ కజువో యుడా చెప్పారు. ఆయన చెప్పింది నిజమే. ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు నిశితంగా పరిశీలిస్తుం టాయి. వాటిని బట్టే తమ వ్యూహాలను, ఎత్తు గడలను నిర్ణయించుకుం టాయి. విధా నాలలో మార్పులు చేసుకుంటాయి. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) సమావేశాల నిమిత్తం వివిధ దేశాలకు చెందిన ఆర్థిక నిపుణులు, మంత్రులు వాషింగ్టన్కు తరలి వచ్చారు.
ప్రపంచంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై సమాలోచనలు జరిపారు. ఇది ఎప్పుడూ జరిగేదే. కానీ ఈసారి అమెరికా ప్రభుత్వ షట్డౌన్ తెర పైకి వచ్చింది. 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమాచారం హఠాత్తుగా నిలిచిపోవడం వారిని కలవరపరచింది. షట్డౌన్ ఎప్పుడైనా ముగిసి పోవచ్చు. అప్పుడు సమాచార ప్రవాహం తిరిగి ప్రారంభం అవుతుంది.
అయితే ఈ ఉదంతం అస్తవ్యస్తంగా అమెరికా పాలన, కనుమరుగవుతున్న డేటా విశ్వసనీయత వంటి అవలక్షణాలను బయట పెడుతోంది. కేంద్ర బ్యాంక్పై పెత్తనం సాగించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ అధిపతిని ఆయన పదవి నుంచి తొలగించారు. అమెరికాలో ఉద్యోగాల పరిస్థితిపై ఐఎంఎఫ్ ఇచ్చిన నివేదికపై మండిపడిన ట్రంప్ ఈ చర్యకు పూనుకున్నారు. షట్డౌన్ కారణంగా ప్రభుత్వం నుంచి సమాచారం అయితే ఆగిపోయింది కానీ అమెరికా రిజర్వ్బ్యాంక్ సర్వేలు, ప్రయివేటు డేటా సర్వీసులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.
వెన్ను విరుస్తోంది : బెస్సెంట్
రెండు వారాలుగా అమెరికాలో కొనసాగుతున్న ప్రభుత్వ షట్డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు వారానికి పదిహేను బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా. షట్డౌన్ అమెరికా ఆర్థిక వ్యవస్థ వెన్ను విరుస్తోందని ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ చెప్పారు. కృత్రిమ మేథలో సహా అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయని, అయితే షట్డౌన్ పెద్ద అవరోధంగా నిలిచిందని తెలిపారు.