Tuesday, April 29, 2025
Homeట్రెండింగ్ న్యూస్'భూదాన్‌'పై రంగంలోకి ఈడీ

‘భూదాన్‌’పై రంగంలోకి ఈడీ

- Advertisement -

క్రయ, విక్రయదారుల లాబీపై ఆరా
ఉన్నతాధికారుల్లో ప్రకంపనలు
భూముల బదలాయింపు విషయంలో సహకరించిన అధికారులకు నోటీసులు
రంగారెడ్డి జిల్లా నాగారం భూదాన్‌ భూముల వ్యవహారం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం రెవెన్యూ పరిధిలోని భూదాన్‌ భూముల వ్యవహారం ఉన్నతాధికారుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ భూములపై నడుస్తున్న కేసుల్లో ఆర్థిక అంశాలు ఉండటంతో ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దృష్టి సారించింది. ఉన్నతాధికారులనూ విచారిస్తోంది. ఒకరిద్దరి ఉన్నతాధికారులతో మొదలైన విచారణ.. ప్రస్తుతం పదుల సంఖ్యలో ఉన్నతాధికారులకు నోటీసులు ఇచ్చేందుకు ఈడీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా నాగారం భూముల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఎవరెవరు బయటికి వస్తారనేది ఆసక్తికరంగా మారింది. నాగారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 181లోని 92 ఎకరాలు, 182లోని 10.2 ఎకరాలు కలిపి మొత్తం 102.2 ఎకరాల భూమి వివాదంలో ఉంది. ఇందులో 50 ఎకరాల భూమి తమదేనంటూ భూదాన్‌ బోర్డు వాదిస్తోంది. వాస్తవానికి ఈ భూమి మొత్తం గతంలో జబర్దస్త్‌ ఖాన్‌ పేరుపై ఉంది. అనంతరం ఆయన కుమారుడు నవాబ్‌ హాజీఖాన్‌ సర్వే నంబరు 181లోని 50 ఎకరాలను భూదాన్‌ బోర్డుకు దానం చేశారని బోర్డు వాదన. ఇదిలా ఉండగా 2021లో హాజీఖాన్‌కు తాను వారసురాలినని, 42 ఎకరాలు తనవేనంటూ ఖాదరున్నీసా సక్సేషన్‌కు దరఖాస్తు చేసుకోగా.. రెవెన్యూ అధికారులు ఆమె పేరున భూమిని బదలాయించారు. అయితే క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు మరో రకంగా వ్యవహరించినట్టు తెలిసింది. ఖాదరున్సీసా పేరున భూమిని బదలాయించిన తర్వాత ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు విక్రయించారు. దీనిపై ఎన్నికల సమయంలో ఫిర్యాదు రావడంతో అధికారులు విచారణ జరిపి తదుపరి క్రయవిక్రయాలు జరగకుండా ధరణిలో నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ వ్యవహారంపై దస్తగిరి షరీఫ్‌ కోర్టును ఆశ్రయించారు. 17వ అదనపు మెట్రోపాలిటన్‌ కోర్టు ఆదేశాల మేరకు మహేశ్వరం పోలీసులు అప్పటి తహసీల్దారు, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌, ఈఐపీఎల్‌ కన్‌స్ట్రక్షన్‌ యజమానిపై కేసు నమోదు చేశారు.నాగారంలోని సర్వే నంబర్లు 181, 182లో మిగిలిన 51.22 ఎకరాల భూమి మహ్మద్‌ అజీజ్‌ఖాన్‌, ఉన్నీసాబేగం, మున్వార్‌ఖాన్‌ పేర్లపై రికార్డుల్లో ఉంది. ఈ భూమిని మాణిక్యమ్మ నగర్‌కు చెందిన చంద్రయ్యగౌడ్‌ మరికొందరు కొనుగోలు చేశారు. విలువైన ఈ భూములపై కన్నేసిన చాంద్రాయణగుట్టకు చెందిన సాహెబ్‌ జాహేద్‌ ఖుర్షీఖాన్‌.. కందుకూరు మండలం మహ్మద్‌గూడకు చెందిన మహ్మద్‌ ఆసిఫ్‌ జానీ, చార్మినార్‌కు చెందిన మహ్మద్‌ హసన్‌, మహ్మద్‌ అబ్బాస్‌, అలీమ్‌ కలిసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్టు పరిశీలనలో తేలింది. హైదరాబాద్‌లోని శాస్త్రిపురంలో 1976లో చేసుకున్న 63 గజాల రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ను అడ్డుపెట్టుకుని 51.22 ఎకరాలను రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ భూమికి సంబంధించి చంద్రయ్యగౌడ్‌ కోర్టులో కేసు వేశారు. భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను నిర్ధారించాలని కోర్టు అప్పట్లో కలెక్టర్‌ను ఆదేశించింది. రెవెన్యూ అధికారులు విచారణ జరిపి, అసలు పట్టాదారు చంద్రయ్యగౌడ్‌ అని నిర్ధారించారు. ఆయన ఫిర్యాదుతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన నిందితులను అరెస్ట్‌ చేశారు. కోర్టు ఆదేశాలతో అప్పటి తహసీల్దారుపై కేసు పెట్టిన తర్వాత ఆమెను విజిలెన్స్‌ అధికారులు విచారించారు. ఈ కేసులో ఫిర్యాదులు అందడంతో ఈడీ విచారణ చేపట్టింది. ఆ సమయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అధికారిని విచారణకు పిలిచినట్టు సమాచారం.
ఉన్నతాధికారులకు నోటీసులిచ్చేందుకు ఈడీ సిద్ధం
భూదాన్‌ భూముల క్రయ, విక్రయాల విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులందరినీ విచారించా లని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దాంతో రంగంలోకి దిగిన ఈడీ.. భూదాన్‌ భూములు క్రయ, విక్రయాలు జరిగిన సందర్భంలో విధుల్లో ఉన్న ఉన్నతాధి కారులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పుడు రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా భూదాన్‌ భూ ముల వ్యవహారం సంచలనంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు