న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లోని అక్రమ కోల్ సిండికేట్కు సంబంధించిన కేసులో ఐదుగురిపై ఈడీ చార్జిషీట్ను నమోదు చేసింది. కోల్ మైనింగ్కు వీరు నకిలీ డాక్యుమెంట్లు ఉపయోగించడం, అధికారులపై బెదిరింపులు. ప్రలోభాలు.. వంటి నేరాలకు పాల్పడినట్టు ఈడీ అభియోగాలు మోపింది. రాష్ట్రంలోని దుర్గాపూర్-అసన్సోల్ ప్రాంతంలో అక్రమంగా బొగ్గు తవ్వకాలు, రవాణా, అమ్మకాలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదులపై ఈ కేసు విచారణ జరుగుతుంది. ఈ ప్రాంతంలోని వివిధ పోలీస్స్టేషన్లలో నమోదైన 54 కేసుల ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ విచారణ చేస్తోంది. ఈస్టర్స్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్), సెంట్రల్ ఇండిస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్, స్థానిక అధికారులు చేసిన ఫిర్యాదులు ఆధారంగా ఈ 54 కేసులు నమోదయ్యాయి. ఈడీ చార్జిషీటు నమోదు చేసిన ఐదుగురిలో చిన్నోరు మండల్, కిరణ్ ఖాన్ కూడా ఉన్నారు. ఈ ఇద్దర్నీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈడీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. చిన్మోరు, కిరణ్ ఖాన్, వారి సహచరులు దుర్గాపూర్-అసన్సోల్, సమీప ప్రాంతాల్లో ఒక వ్యవస్థీకృత బొగ్గు సిండికేట్ను నిర్వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది. ఈ సిండికేట్ చట్టవ్యతిరేక మార్గాల ద్వారా బొగ్గు సేకరించడం, మైనింగ్ చేయడం, దాన్ని రవాణా చేయడంలో కీలకంగా ఉందని తెలిపింది. ఈ ప్రాంతంలో బొగ్గు మైనింగ్, రవాణా ఈ సిండికేట్ కనుసన్నల్లోనే జరిగిలే ఒక వ్యవస్థ ఏర్పాటయిందని చార్జీషీట్లో ఈడీ పేర్కొంది. దీని ద్వారా ఈసీఎల్కు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లగా, మరోవైపు సిండికేట్ మాత్రం రూ 650 కోట్లకు పైగా అక్రమంగా ఆదాయాన్ని ఆర్జించిందని ఈడీ తెలిపింది.



