న్యూఢిల్లీ : విద్య కొందరికే ప్రత్యేక హక్కుగా మారకూడదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారతదేశానికి దేశ గొప్ప వైవిధ్యాన్ని ప్రతిబింబించే విద్యా వ్యవస్థ అవసరమని అన్నారు. విద్య కొంతమందికే ప్రత్యేక హక్కుగా మారకూడదని, అది స్వేచ్ఛకు పునాదిగా ఉండాలని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అభివృద్ధి చెందే ప్రత్యామ్నాయ తయారీ వ్యవస్థను భారత్ నిర్మించాల్సి వుందని, ముందుకు సాగేందుకు పెరూ లేదా అమెరికా భాగస్వామ్యం మార్గం కావచ్చని ఆయన ఆదివారం ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. దక్షిణ అమెరికాలోని విద్యార్థులతో సంభాషించిన వీడియోను కూడా జతచేశారు. విద్య విషయానికి వస్తే.. ఉత్సుకతతో, రాజకీయ లేదా సామాజికంగా ఎటువంటి భయం లేదా పరిమితులు లేకుండా బహిరంగంగా ఆలోచించేందుకు, ప్రశ్నలు అడిగేందుకు స్వేచ్ఛ ఉండాలని అన్నారు. స్వేచ్ఛకు విద్య పునాది అని, శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించే, విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహించే, మన దేశ గొప్ప వైవిధ్యాన్ని ప్రతిబింబించే విద్యావ్యవస్థ భారతదేశానికి అవసరమని ఉద్ఘాటించారు.