మానవజాతిని కలవర పెడుతున్న హింసాత్మక ఘటనలు దేశంలో అనేకం చోటుచేసుకుంటున్నాయి. అనాగరిక దుశ్చర్యలు, మానవీయ సంబంధాల మధ్య అగాధం సృష్టిస్తున్నా యి. మంచులా కరిగిపోతున్న ఆత్మీయతలు, మితిమీరిన హింసా ప్రవృత్తి, అంతర్గతంగా దేశభద్రతకు విఘాతం కలిగిస్తున్నాయి. ఈ మధ్యకాలంలోజమ్మూకాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన మతోన్మాద ఉగ్రదాడి పట్ల దేశమంతా స్పందించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ముక్త కంఠం వినిపించింది. అయితే దేశభక్తి ముసుగులో కొంతమంది చేస్తున్న అరాచకత్వం మాత్రం ఆక్షేపణీయం. అవీ పార్టీలైనా, సంస్థలైనా, సంఘాలైనా ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తున్న వారిపట్ల కఠినంగానే వ్యవహరించాలి. అయితే ఈ మతోన్మాదాన్ని పెంచిపోషించేది పాలకులే అయితే గనుక వారికి తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెప్పాలి. ఇప్పుడు చెప్పదలుచుకున్న అంశం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే? ఈ ఉగ్రదాడులు, వారికి సహకరించేవారు, లేదంటే ప్రోత్సహిస్తూ తోడ్పాటునందించే వారు ఇతరదేశాల్లోనే కాదు, మనదేశంలో కూడా ఉన్నారన్నది ఇంటిలిజెన్స్ సమాచారం. దాన్ని అరికట్టడం ఇప్పుడు సాధ్యమా? వారు అలా ఎందుకు తయారయ్యారన్న మూలాల్ని పట్టుకోవడం ముఖ్యం. అందుకు మన విద్యా విధానంలో చిన్నప్పటి నుంచే మానవీయ విలువల్ని నేర్పడం అత్యవశక్యం.ఎందుకంటే, నేటి బాలలు రేపటి భారత పౌరులుగా, భారత సమాజ నవనిర్మాణానికి పునాదులుగా చెప్పుకుంటున్నాం. కానీ వారికి మంచి బుద్దులు నేరాల్సింది ఈతరం విద్యా బోధకులదే. భారత జాతీయ సమైక్యతత్వాన్ని, లౌకికవాదాన్ని, దేశభక్తిని విద్యార్థి దశ నుండే విద్యార్థుల మనసుల్లోకి చొచ్చుకుపోయేలా వారికి ఈ విలువల్ని నేర్పించాలని ఇప్పుడు పౌర సమాజం బలంగా అభిప్రాయ పడుతున్నది.
పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఉగ్రముఖులకు సహకరించిన కొందరు వ్యక్తులు దేశంలో కూడా ఉన్నారని వార్తల్లో, టీవీల్లో చూశాం. అయితే ఇంతటి తెగింపు, ఉన్మాదం తలకెక్కించుకునే పరిస్థితి ఎందుకు వస్తుందనేది కీలకం. చదువులో సరిగా రాణించని వారుంటే నైపుణ్యాన్ని బట్టి పనిచేసుకుంటారు. కానీ ఇక్కడ దేశద్రోహం పేరుతో ముద్రవేస్తూ వారిని ముప్పు తిప్పలు పెడుతున్నవారే ఉగ్రవాదానికి సహరిస్తున్నారా? అనే అనుమానం కలగకమానదు. బాల్య దశ నుండి సరైన దిశానిర్దేశం లేక, మానవియ కోణంలో ఆలోచించే ధోరణి తగ్గిపోవడం,హానికరమైన కనికరం లేని లేని కఠినత్వ మనస్తత్వాలతో కొందరు క్రూరంగా మారడం ఈ దుస్థితికి కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. సమాజంలో హింసాత్మ ధోరణికి చాలా కారణాలు వెతకచ్చు. కానీ వాటి మూలాల్ని అణిచివేసే దిశగా పాలకులు అడుగులు వేయడం కావాలి. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల జీవనగమనంలో విద్యతోపాటు భవిష్యత్తు సమాజ నిర్దేశికత ఆలోచన విధానాలను ప్రతిబింబించేలా ఉపాధ్యాయులు ప్రేరణగా నిలుస్తారు. ప్రాథమిక పాఠశాల బాల్య దశలో విద్యార్థుల ఆలోచన విధానానికి బీజం పడుతుందనడంలో సందేహం లేదు. పరిసరాల్లో జరుగుతున్న విషయాలపై ఆసక్తి ఈ దశలోనే పెరుగుతుంది. విద్యతో పాటు విద్యార్థుల మనసులో మానవతా విలువలు, మానవతా దృక్కోణం, ఆలోచనలు దేశ జాతీయభావ స్ఫూర్తితో నేర్పాల్సింది ఈ దశలోనే.
నేర ప్రవృత్తిని నిరోధించే విధంగా, హింసకు తావులేని ఆదర్శవంతమైన జీవన విధానాలను గమ్యాన్ని నిర్దేశించి విద్యావ్యవస్థనే.అక్కడ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతో పాటు, జీవన విధానంలో వస్తున్న మార్పులకనుగుణంగా వారిని తీర్చిదిద్దడం వారి లక్ష్యంగా ఉండాలి.నేడు శాస్త్రీయ విద్యా విజ్ఞానాన్ని పెంపొందించే బోధన రోజురోజుకూ అంతరిస్తున్నది. పాలకులే మూఢ నమ్మకాల్ని పెంచిపోషిస్తున్న దుస్థితిని ఈ దశాబ్ద కాలంగా చూస్తున్నాం. స్ఫూర్తివంతమైన రచనలు, అందులోని అంశాలు, దేశ శ్రేయస్సు కోసం పోరాడిన మహానుభావుల చరిత్రల్ని తొక్కిపెట్టడం, తొలగించడం అత్యంత శోచనీయం. ఇలాంటి విధానాలే మన విద్యార్థులకు శాపాలుగా మారుతు న్నాయి. వారిని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు విఫలమవ్వ డానికి ఇలాంటివి కూడా దోహదపడతాయి. ఇలాంటి వాటి ప్రభావంతో విద్యార్థులకు నష్టం జరగకుండా ఉంటాలంటే ముందు వారి మనసుల్లో ద్వేషభావం పోవాలి. వారిలో పాజిటివ్ ధోరణి పెంచే విధంగా పాఠాలు, బోధనలు ఉండాలి. సమాజంలో జరిగే ప్రతిచర్య వెనుక ఉన్న మూలాన్ని పట్టుకుని వారికి వివరించాలి. మతోన్మాద భావజాలాన్ని వ్యతిరేకించే విధంగా వారిని తయారు చేయాలి. లేదంటే వారు పెద్దయ్యాక కులం, మతం, ప్రాంతం పేరుతో కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఒక నేరం లేదంటే ద్వేషభావం కుటుంబాన్ని ఎలా విచ్ఛిన్నం చేసి వారి ఉజ్వల భవిష్యత్తును నాశనం చేస్తుందో ఉదాహర ణలతో చూపించాలి. జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీల గురించి వివరించాలి. నేరాల్ని తగ్గించేందుకు విద్యావ్యవస్థలో ఉన్న అనేక అవకాశాల్ని ఉపయోగించుకోవాలి. పోలీసులు కూడా ఈ ప్రయత్నాన్ని గౌరవించాలి, సహకరించాలి. అన్నింటికన్నా ముందు తల్లిదండ్రలు, సమాజంలోని ప్రతిఒక్కరూ మంచిచె డుల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ప్రతి గ్రామంలో పోలీసులు, ప్రభుత్వ అధికారులు సమావేశమై ప్రజలతో మమేక మవ్వాలి. నేర ప్రవృత్తిగల యువకుల్లో మౌళిక ఆలోచనలు పెంచే విధంగా కృషి చేయాలి. సమాజంలో చదువే అన్నింటికి మూలమన్న విషయాన్ని గమనించేలా, దానితోనే వారు అభివృద్ధి అయ్యేలా తోడ్పాటునందించాలి. అప్పుడే మెరుగైన సమాజంలో విద్యార్థులు, యువకులు భాగస్వాములవుతారు.
– దాడిశెట్టి శ్యామ్ కుమార్, 9492097974.
విద్యావ్యవస్థ-మానవీయ విలువలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES