– ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్
నవతెలంగాణ -ములుగు
జిల్లాలో ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కొరకు నిర్వహిస్తున్న ”పోరు కన్నా ఊరు మిన్న, మన ఊరికి తిరిగి రండి” కార్యక్రమం ద్వారా లొంగిపోయిన దళ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ కల్పిస్తున్న సదుపాయాల గురించి తెలుసుకుని వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న ఎనిమిది మంది మావోయిస్టు పార్టీ సభ్యులు జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకు వచ్చారని అన్నారు. వారిలో డివిజనల్ కమిటీ సభ్యుడు, ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు ముగ్గురు పార్టీ సభ్యులు , ఇద్దరు మిలిషియా సభ్యులు ఉన్నారని తెలిపారు. వారికి ఒక్కొక్కరికి రూ.25 వేల రివార్డు అందించామని అన్నారు. ఇందులో నలుగురు గెరిల్లా యుద్ధ నైపుణ్యంతో కూడిన సాయుధ దళాల్లో పనిచేశారని చెప్పారు. ఈ సంవత్సరం జనవరి నుండి రాష్ట్రంలో ఇప్పటివరకు 355మంది అజ్ఞాత మావోయిస్టులు లొంగిపోయారని అన్నారు. ములుగు జిల్లా నందు 68 మంది మావోయిస్టు దళ సభ్యులు, వివిధ సంఘాల నుండి మిలిషియా ఆర్పిసి సిఎన్ఎం, డిఏకెఎంఎస్ లలో పనిచేసిన 38 మంది సభ్యులు జనజీవన స్రవంతిలో కలిసి పునరావాస సౌకర్యాలను పొందినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎటునాగారం ఎస్పి ఉపాధ్యాయ, ములుగు డిఎస్పి నలువాల రవీందర్, ఎటు నగరం సీఐ అనుముల శ్రీనివాస్, ఏటూర్ నాగారం, వెంకటాపురం ఎస్ఐలు తాజుద్దీన్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఎనిమిది మంది దళ సభ్యులు లొంగుబాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES