నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులు అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం యాదాద్రి 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆలేరు,యాదగిరిగుట్ట, భువనగిరి మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రక్రియ పనులను ఎన్నికల అధికారి, కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని,ఇప్పటి వరకు వార్డుల వారీగా ఒక్కొక వార్డులో ఎన్ని నామినేషన్లు దాఖలు అయ్యాయని అడిగి తెలుసుకున్నారు.
అందులో ఎంతమంది అభ్యర్థులు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారని అడిగి తెలుసుకున్నారు. విత్ డ్రా ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల పార్టీలకు సంబంధించి ఫార్మ్- ఏ, ఫారం- బి సమర్పించారా అని ఆరా తీశారు. ఎన్నికల సంఘం ఆదేశాలను తూచా తప్పక పాటిస్తూ పోటీలో ఉన్న అభ్యర్థులకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఎన్నికల కమిషన్ ఇచ్చిన గుర్తులు కేటాయించాలన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రకియ నిష్పక్షపాతంగా, పారదర్శకత అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, సిబ్బంది పాల్గొన్నారు.



