అప్పుల సాకుతో వాయిదాకు యత్నం
కొత్తగా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ వేయలే..
కేంద్రం ఆపరేషన్ కగార్ను ఆపేయాలి
మావోయిస్టులను తరిమేసి అడవులను కార్పొరేట్లకు అప్పగించే కుట్ర : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
నవతెలంగాణ-హుజూర్నగర్
అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో బుధవార విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదన్నారు. రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి కొత్తగా ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదన్నారు. రైతు భరోసా సకాలంలో రైతులకు అందటం లేదన్నారు. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్న హామీ అమలు కాలేదన్నారు. మహిళలకు రూ.2500, ఎస్సీ ఎస్టీలకు అభయహస్తం పేరిట రూ.12 లక్షల ఆర్థిక సహాయం ఆచరణకు నోచుకోలేదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని, రాష్ట్రం అప్పుల పాలు అయిందని సాకు చూపెట్టి వాగ్దానాలను వాయిదా వేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన వాగ్దానాలు పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు తమ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు అందడం లేదన్నారు. కల్తీ విత్తనాల విక్రయాల నివారణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
సమస్యలను వదిలేసి.. కాళేశ్వరంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నాయే తప్ప రాష్ట్రంలో కొత్తగా నూతన ప్రాజెక్టులు చేపట్టడం లేదన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదన్నారు. పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించి ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలన్నారు. ఇప్పటికే 12 గురుకుల పాఠశాలలు మూతపడ్డాయని తెలిపారు. ప్రయివేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారం చేసుకుని, ఫీజులు భారీ వసూలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు నియంత్రణ చేపట్టాలన్నారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలన్నారు. పాకిస్థాన్తో చర్చలు జరపడానికి సమయం ఉంటుందిగానీ.. దేశంలో ఉండే మావోయిస్టులతో చర్చలు జరపడానికి సమయం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మారనకాండను కొనసాగించటం దుర్మార్గమన్నారు. మావోయిస్టులతో చర్చలు జరిపి మారణకాండను ఆపాలని ఇప్పటికే తమ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. 2026 వరకు మావోయిస్టులను లేకుండా చేస్తామని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం సరైంది కాదన్నారు. మావోయిస్టులను ఛత్తీస్గఢ్ అడవుల నుంచి వెళ్లగొట్టి.. ఆ అడవులను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తోందని ఆరోపించారు. ఈ హత్యాకాండలో అమాయకులు కూడా బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ గాజాపై యుద్ధం చేస్తోందని, దాంతో గాజా ఇప్పటికే శ్మశాన వాటికగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అబ్బాస్, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నాగారపు పాండు, ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, ఐద్వా జిల్లా అధ్యక్షులు తంగళ్ళ వెంకట చంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల హామీలు అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES