అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మెన్ ఆదేశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో గృహ, పారిశ్రామిక విద్యుత్ వినియోగాలకు తోడు, ఈ వానాకాలం పంటల సీజన్లో వ్యవసాయ వినియోగం కూడా భారీగా పెరుగుతున్నది. గ్రామీణ జిల్లాల విద్యుత్ అధికారుల సమావేశంలో.. మరింత అప్రమత్తంగా ఉంటూ విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యల్లేకుండా చూడాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు. తాజాగా కురిసిన భారీ వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పంటల సాగు గణనీయంగా పెరుగుతోంది. గతేడాది ఇదే సీజన్తో పోల్చుకుంటే విద్యుత్ వినియోగం దాదాపు 50 శాతానికి మించి నమోదవుతోంది. ప్రధానంగా దక్షిణ డిస్కం పరిధిలోని జిల్లాల్లో దాదాపు రెట్టింపు స్థాయిలో విద్యుత్ వినియోగం జరుగుతున్నది. మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతేడాది సెప్టెంబర్ 1న 13.6 మిలియన్ యూనిట్లుగా ఉన్న వినియోగం ఈ ఏడాది అదే రోజున 33.82 మిలియన్ యూనిట్ల వినియోగంతో దాదాపు 148శాతం పెరుగుదల నమోదైంది. ఇతర జిల్లాల్లోనూ అదే పరిస్థితి. దక్షిణ డిస్కం పరిధిలో ఈ ఏడాది అదనంగా దాదాపు 26 వేల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేశారు. ప్రస్తుతం గ్రామీణ జిల్లాల్లో 4.92 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఎక్కడైనా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లో సమస్యలు ఏర్పడితే వెంటనే మార్చేందుకు తప్పనిసరిగా ప్రతి సర్కిల్ పరిధిలో తగినన్ని డీటీఆర్లు రోలింగ్ స్టాక్లో అందుబాటులో ఉండేలా చూడాలని సీఎండీ సూచించారు. విద్యుత్ అధికారులు తరచూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విద్యుత్ సామాగ్రి స్టోర్స్, ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్స్ను విధిగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు డాక్టర్ నరసింహులు, శివాజీ, కృష్ణారెడ్డి, చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
పెరిగిన విద్యుత్ వినియోగం
దక్షిణ డిస్కం పరిధిలో గతేడాది వానాకాలం పంటల సీజన్లో సెప్టెంబర్ 20న నమోదైన 9,910 మెగావాట్ల గరిష్ట డిమాండ్ను తాజాగా ఈ నెల 8న 1,0450 మెగావాట్ల గరిష్ట డిమాండ్తో 203.38 మిలియన్ యూనిట్ల వినియోగంగా నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా, గతేడాది సెప్టెంబర్ 20వ తేదీన నమోదైన గరిష్ట డిమాండ్ 15,570 మెగావాట్లు కాగా, సోమవారం 15,906 మెగావాట్లుగా నమోదైంది.