గల్ఫ్ దేశాల్లో నలుగురి మృతితో యూఏఈ నిర్ణయం
అబూదాబీ : ఇరాన్ చేపట్టిన ప్రతీకార క్షిపణి, డ్రోన్ దాడుల్లో గల్ఫ్ ప్రాంతంలో నలుగురు మరణించడంతో యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని తన రాయబార కార్యాల యాన్ని మూసివేస్తూ… అక్కడి తన రాయబారిని వెనక్కి పిలుపించుకుంది. అమెరికా, ఇజ్రాయిల్.. ఇరాన్పై భారీ వైమానిక దాడులు జరిపిన తర్వాత పరిస్థితి మరింత తీవ్రంగా మారిన విషయం విదితమే. దీంతో ఇరాన్.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులు ప్రారంభించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఇరాన్ జరిపిన దాడులను యూఏఈ ఖండించింది. దీనిని పౌరులపై జరిగిన బాధ్యతారహితమైన, ప్రమాద కరమైన దాడులుగా పేర్కొంది. యూఏఈ 2022లో ఇరాన్తో సంబంధాలు మెరుగుపడిన తర్వాత తన రాయబార కార్యాలయాన్ని పూర్తిగా తిరిగి ప్రారంభించింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ మూసివేయడం గమనార్హం. మొత్తంగా ఇరాన్, అమెరికా- ఇజ్రాయిల్ మధ్య జరిగిన యుద్ధ పరిణామాలు ఇప్పుడు గల్ఫ్ దేశాలకు వ్యాపించి, ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.


