యాభయ్యేళ్ల క్రితం దేశంలో అంతర్గత అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అప్పుడు నేను స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్.ఎఫ్.ఐ) కేరళ రాష్ట్ర అధ్యక్షుడిగా, కొల్లంలోని శ్రీనారాయణ కాలేజీలో పొలిటికల్ సైన్స్ విద్యార్థిగా ఉన్నాను. అత్యవసర పరిస్థితి ప్రకటించిన దాదాపు వారం రోజుల్లోనే, త్రివేండ్రంలోని ప్రభుత్వ సచివాలయం ఎదుట ‘అరేబియా సముద్రంలో ఎమర్జెన్సీ’ అనే నినాదాలతో నిరసన చేపట్టాం. వెంటనే మమ్మల్ని అరెస్టు చేశారు. ఆ చీకటి రోజుల్లో లాకప్లో భౌతిక దాడులు సర్వసాధారణం. అది ముగిసిన తరువాత డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం కింద జైలులో వేశారు.
ఆ సమయంలో కామ్రేడ్ ఎ.కె.గోపాలన్, ఇ.ఎం.ఎస్ నంబూద్రిపాద్ వంటి ప్రముఖ నాయకులను కూడా అరెస్టు చేశారు. అయితే ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుందన్న భయంతో త్వరలోనే వారిని విడుదల చేశారు. చాలా మంది కమ్యూనిస్టు పార్టీ (సీపీఎం) నేతలను మాత్రం మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ (మీసా), డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం కింద జైళ్లలో పెట్టారు. వారిలో అప్పటి, ఇప్పటి పొలిట్బ్యూరో సభ్యులు చాలా మందే ఉన్నారు.ఎమర్జెన్సీ ప్రకటించక ముందే, పశ్చిమ బెంగాల్లో 1972 నుండి కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రారు పాలనలో అర్థ ఫాసిస్ట్ పాలన సాగుతోంది. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ ప్రభుత్వానికి ఫాసిస్టు ధోరణులు వ్యక్తమైన మాట నిజమే. దాన్ని చాలా మంది ఫాసిస్టు చర్యగా గట్టిగా ఖండించినదీ సత్యమే. కామ్రేడ్ ఎ.కె.గోపాలన్ (ఎ.కె.జి) ఇందిరా గాంధీని ‘మహిళా హిట్లర్’గా అభివర్ణించిన విషయం మరువలేనిది. అయితే, అది నిజానికి పూర్తి స్థాయి ఫాసిజం కాదు. అది కొన్ని ఫాసిస్టు లక్షణాలు కలిగిన అత్యంత నిరంకుశ పాలన.
ఈ రాజకీయ నేపథ్యంలోనే కామ్రేడ్ ఇ.ఎం.ఎస్ నంబూద్రిపాద్ ప్రముఖ మార్క్సిస్టు సిద్ధాంతవేత్త. జార్జి డిమిట్రోవ్ రచించిన ‘ఫాసి జానికి వ్యతిరేకంగా ఐక్య సంఘటన’ అనే సిద్ధాంత గ్రంథాన్ని మలయాళంలో ప్రచురించేందుకు సిద్ధపడ్డారు. దీనికి తానే స్వయంగా పెద్ద ఉపోద్ఘాతాన్ని కూడా రాశారు. ఈ డిమిట్రోవ్ సిద్ధాంత పత్రం ఫాసిజం అంటే ఏమిటి, దాన్ని ఎదిరించేందుకు ఎలా విస్తృత ఐక్యవేదికను నిర్మిం చాలనే అంశాలపై ప్రధానంగా చర్చించింది. 1935లో, లెనిన్ నేతృత్వంలో ఏర్పాటైన మూడవ ఇంటర్నేషనల్ (కమ్యూనిస్టు ఇంటర్నేషనల్) ఏడవ మహాసభలో, ముస్సోలినీ (ఇటలీ), హిట్లర్ (జర్మనీ )లతో పాటు ఇతర దేశాల్లో అప్పుడప్పుడే ఉద్భవిస్తున్న కొత్త ప్రమాదకర విధానాన్ని సమగ్రంగా విశ్లేషించారు. ఆ మహాసభలోని చర్చలను, ముఖ్యంగా డిమిట్రోవ్ చేసిన ప్రభావ వంతమైన ముగింపు ప్రసంగాన్ని సారాంశంగా అందించిన పత్రమిది.
డిమిట్రోవ్ ఫాసిజాన్ని ‘ఫైనాన్స్ క్యాపిటల్ యొక్క అత్యంత అభివృద్ధి నిరోధక, తీవ్ర ఛాందసవాద, తీవ్ర సామ్రాజ్యవాద శక్తుల బహి రంగ భయానక నియంతృత్వ పాలన (టెర్రరిస్ట్ డిక్టేటర్షిప్)’గా నిర్వచించారు. అయితే, ఫాసిజాన్ని పూర్తిగా విశ్లేషించే సాధారణ నిర్వచనం ఏదీ లేదని డిమిట్రోవ్ చెప్పారు. ‘ఏదైనా నిర్వచనం ఎంత సరిగ్గా ఉన్నప్పటికీ, ప్రతి దేశంలో ఫాసిజం ఎలా అభివృద్ధి చెందుతున్నది, దాని ప్రత్యేక లక్షణాలు ఏమిటి, దాని వేర్వేరు రూపాలు, దశలను అధ్యయనం చేయడం, వాటిని పరిగణనలోకి తీసుకోవడం అవసరం. ప్రతి దేశంలోనూ అక్కడి ప్రత్యేక పరిస్థితులను, ఫాసిజానికి సంబంధించిన జాతీయ లక్షణాలను విశ్లేషించి, దానికి తగ్గ విధానాలను, పోరాట రూపాలను రూపొందించుకోవాలి” అని డిమి ట్రోవ్ స్పష్టం చేశారు.రాజ్యాధికారాన్ని ఫాసిజం స్వాధీనం చేసుకోవడమంటే ఒక బూర్జువా ప్రభుత్వానికి ప్రత్యామ్నా యంగా మరో బూర్జువా ప్రభుత్వం రావడం వంటిది కాదు. అది ఒక పాలక వర్గ ప్రభుత్వ రూపాన్ని మరొక రూపానికి మార్చడం. అంటే, బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్థానంలో బహిరంగ భయానకమైన నియంతృత్వాన్ని ప్రతిష్టించడమే.
1972లో మదురైలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తొమ్మిదవ అఖిల భారత మహాసభలో, భారత ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న తీవ్రమైన సమస్యలు, 1971 ఎన్నికల సమయంలో ‘గరీబీ హఠావో’ వంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైనందువల్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యాపిస్తోందని స్పష్టంగా పేర్కొన్నారు. ఆ మహాసభలో ఆమోదించిన రాజకీయ తీర్మానంలో, ఇందిరా గాంధీ ప్రభుత్వం వేగంగా ఒక నిర్బంధపు నిరంకుశ పాలనగా మారిపోతోందని హెచ్చరించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలోని ఆ చీకటి రోజులను ప్రమాదాలను ముందు నుండే సీపీఐ(ఎం) పసిగట్టి, తీవ్రంగా ఎదిరించింది. అదే సమయంలో ఇతరులు కొందరు దానికి మద్దతుగా నిలిచిన విషాద సత్యాన్ని కూడా మరచిపోకూడదు.
బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత యువత తమశక్తిని వినియోగించ వద్దన్నది హెడ్గేవార్, గోల్వాల్కర్లు అప్పట్లో ఇచ్చిన పిలుపు. సావర్కర్ బ్రిటిష్ వలస పాలకులకు అరడజను క్షమాభిక్ష పత్రాలు రాయడం వంటి ఆరెస్సెస్ పంథా, అత్యవసర పరిస్థితి సమయంలోనూ అదే తరహాలో కొనసాగింది. అత్యవసర పరిస్థితి సమయంలో ఆరెస్సెస్ సర్సంఫ్ు చాలక్గా ఉన్న మధుకర్, దత్తాత్రేయ, దేవరస్ ఇందిరాగాంధీకి క్షమాపణా పత్రాలు రాశారు. ఆయన రచించిన ‘హిందూ సంఘటన ఔర్ సత్తావాది రాజనీతి’ అనే పుస్తకానికి ఈ పత్రాల ప్రతులను అనుబంధాలుగా జత చేశారు.
1975 ఆగస్టు 22 తేదీన రాసిన ఉత్తరంలో ”జాతిని ఉద్దేశించి మీరు చేసిన ప్రసంగం సమయానుకూలంగా, సందర్భోచితంగా ఉంది” అని ఇందిరాగాంధీని ప్రశంసిస్తూ దేవరస్ ప్రారంభించారు. అనంతరం, ”దయచేసి దీన్ని పరిగణనలోకి తీసుకుని ఆరెస్సెస్పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయండి. మీరు అంగీకరిస్తే మీతో ప్రత్యక్షంగా భేటీ కావడం నాకు ఆనందంగా ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు. 1975 నవంబర్ 10వ తేదీన రాసిన మరో ఉత్తరంలో, అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల నుంచి ఆరెస్సెస్ను విడదీసే ప్రయత్నం చేశారు. ”జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమ సందర్భంలో ఆరెస్సెస్ పేరు చేర్చారు. గుజరాత్ ఉద్యమం, బీహార్ ఉద్యమాలతో కూడా ప్రభుత్వం కారణం లేకుండానే ఆరెస్సెస్ను కలిపి చేర్చింది. నిజానికి సంఫ్ుకు ఈ ఉద్యమాలతో ఎలాంటి సంబంధం లేదు” అని ఆయన రాశారు. తిరిగి చివరలో, ”లక్షలాది ఆరెస్సెస్ కార్యకర్తల నిస్వార్థ శ్రమను ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల కోసం వినియోగించుకోవచ్చు” అని పేర్కొంటూ ఆరెస్సెస్పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలన్న వినతితో ముగించారు.
ఈ లేఖ యొక్క తక్షణ ఫలితంగా అత్యవసర పరిస్థితి ప్రకటించిన తొలి వార్షికోత్సవం సందర్భంగా, 1976 జూన్ 25న ప్రస్తుత బీజేపీకి తొలి రూపమైన భారతీయ జనసంఫ్ు (బి.జె.ఎస్) ఉత్తరప్రదేశ్ శాఖ ప్రభుత్వం పట్ల సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఇకపై ప్రభుత్వ వ్యతిరేక కార్యకలా పాలలో పాల్గొనబోమని ప్రకటించింది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే అప్పటి నివేదికల ప్రకారం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలోని జనసంఫ్ుకు చెందిన 34మంది కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అత్యవసర పరిస్థితి సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐ.బి) డిప్యూటీ చీఫ్గా పనిచేసిన టివి రాజేశ్వర్, తన ‘ఇండియా: ది క్రూషియల్ ఇయర్స్’ అనే పుస్తకంలో, దేవరస్ అప్పటి ప్రధాని కార్యాల యంతో నేరుగా సంబంధాలు పెట్టుకున్నట్టు, క్రమశిక్షణ, నియమాల అమలు పేరిట ఇందిరాగాంధీ తీసుకున్న చర్యలకు బలంగా మద్దతును వ్యక్తం చేసినట్లు రాశారు. ముఖ్యంగా ఇందిరాగాంధీ కుమారుడు సంజరు గాంధీ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రత్యేకించి ముస్లింలలో బలవంతంగా అమలు చేయడాన్ని దేవరస్ ప్రశంసించినట్టు రాజేశ్వర్ పేర్కొన్నారు.
‘ది హిందూ’ పత్రికలో 2000 జూన్ 13న ప్రచురితమైన ‘ది అన్ లెరన్డ్ లెసన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ’ అనే వ్యాసంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి, అత్యవసర పరిస్థితి సమయంలో ఆరెస్సెస్ నేతలు పోషించిన సందేహాస్పద పాత్రను మరింత బహిర్గతం చేశారు. ఆయన చెప్పినదాని ప్రకారం, అటల్ బిహారి వాజ్పేయి జైలులో ఉన్నది కేవలం కొన్ని రోజులే. మిగతా కాలం పెరోల్పై బయటే ఉన్నారు. ఇందిరా గాంధీతో ఒప్పందం చేసుకుని, ఇకపై ఏ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనబోనని హామీ ఇచ్చి విడుదల అయ్యారని స్వామి పేర్కొన్నారు. ‘పెరోల్ మీద బయట ఉన్న సమయంలో ప్రభుత్వం చెప్పిందల్లా వాజ్పేయి చేశారు’ అని స్వామి వ్యాఖ్యానించారు. అంతేకాదు, 1976 నవం బర్లో సీనియర్ ఆరెస్సెస్ నాయకుడు మాధవరావు మూళే ప్రతిఘటన ప్రయత్నాలను ఆపమని తనకు సలహా ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఎందుకంటే ‘జనవరి చివరిలో సంతకం చేయాల్సిన లొంగుబాటు పత్రాన్ని ఆరెస్సెస్ ఖరారు చేసింది’ అని మాధవరావు చెప్పినట్లు స్వామి రాశారు. అంటే, ఆ చీకటి రోజుల్లో తమవారు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడా రంటూ ప్రస్తుత ఆరెస్సెస్, బీజేపీ నేతలు చెప్పుకుంటున్న దానిలో ఏమాత్రం నిజం లేదని, నిజానికి అప్పట్లో పాలకుల ముందు తలవంచారని సుబ్రమణ్యస్వామి వెల్లడించిన దాన్ని బట్టి విధితమవుతోంది.
అత్యవసర పరిస్థితి ప్రకటించడం అన్నది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. అప్పట్లో జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో ‘సంపూర్ణ విప్లవం’ నినాదం దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. విద్యార్థులు, యువత పెద్దసంఖ్యలో రోడ్ల మీదకు వచ్చి ఆ ఉద్యమానికి మద్దతు పలికారు. దీంతో ఇందిరా గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేత బాట పట్టింది.1974లో జరిగిన రైల్వే సమ్మె కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపివేసింది. ఆ సమ్మెను అణచడానికి ప్రభుత్వం అవలంబించిన అరాచక, దౌర్జన్యపూరిత చర్యలు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు రేపాయి. గుజరాత్లో ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోగా, ఎన్నికలు మాత్రం నిర్వహించలేదు. దీన్ని వ్యతిరేకిస్తూ మొరార్జీ దేశారు నిరాహార దీక్షకు దిగారు. చివరికి తట్టుకోలేక ఇందిరా గాంధీ గుజరాత్లో ఎన్నికలు ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది.
1975 జూన్ 12న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం, అలహాబాద్ హైకోర్టు తీర్పు ఒకే రోజు వెలువడ్డాయి. ఈ రెండింటిలోనూ ఇందిరా గాంధీ, కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాభవమే ఎదురైంది. అలహాబాద్ హైకోర్టు తీర్పు ప్రధాని ఇందిరా గాంధీ ఎన్నికల్లో అక్రమాలు చేశారని తేల్చి, ఆమెను ఆరేండ్లపాటు ఎన్నికలలో పోటీ చేయరాదని, ఏ ప్రజా ప్రతినిధిగానూ కొనసాగడానికి వీలు లేదని నిషేధించింది. ఇందిరా గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించి బేషరతుగా స్టేను కోరారు. అయితే, జస్టిస్ కృష్ణయ్యర్ ఆమెకు అవమానకరమైన షరతులతో మాత్రమే స్టే ఇచ్చారు. దీనితో, అధికారం కోల్పోకుండా ఉండాలంటే అత్యవసర పరిస్థితి ప్రకటించడం మినహా మరో మార్గం లేని పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం నియంతృత్వ చర్య మాత్రమే కాదు. తగిన పక్రియను పాటించకుండా తీసుకున్న నిర్ణయం కూడా. అప్పటి ప్రధానమంత్రి తన సొంత మంత్రివర్గాన్ని కూడా సంప్రదించ కుండానే అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్టు షా కమిషన్ విచారణలో తేలింది.
‘ప్రజాస్వామ్య భవనంలో’ ‘నిరంకుశత్వానికి కూడా స్థలం ఉంటుంద’ని అంటారు. ఆధునిక బుర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వేచ్ఛ, సమావేశ స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటివన్నీ చట్టబద్ధంగా కనిపిస్తాయి. కానీ, ప్రజల ఉద్యమాల ద్వారా దోపిడీ వ్యవస్థను తొలగించి సమానత్వ ఆధారిత వ్యవస్థను స్థాపించే అవకాశాలు కనిపిస్తే ఆ హక్కులన్నీ అణచివేస్తారు. అప్పుడే బూర్జువా ప్రజాస్వామ్యపు కాంతివం తమైన ముసుగుకు లోపల వున్న నిరంకుశత్వపు ధోరణుల అసలు రూపం బట్టబయలవుతుంది. 50 ఏళ్ల క్రితం అంతర్గత అత్యవసర పరిస్థితిలో అదే చూశాం. ఇప్పుడు మోడీ ప్రభుత్వ హయాంలో అప్రకటిత అత్యవసర పరిస్థితుల్లోనూ మనం చూస్తున్నది అదే!1977 ఎన్నికల్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అత్యంత నిర్ణయాత్మకంగా స్పందించినవారు భారతదేశంలోని సాధారణ ప్రజలు. ముఖ్యంగా మన జనాభాలోని పేద, గ్రామీణ ప్రజలు. వాస్తవానికి, అత్యవసర పరిస్థితి సమయంలో విధించిన కొన్ని షరతులను సడలించడం ద్వారా మాత్రమే ఎన్నికలు జరిగా యి (ఎమర్జెన్సీని పూర్తిగా ఎత్తివేయలేదు). ఇందిరా గాంధీ, కాంగ్రెస్ భారత ప్రజల చేతిలో అవమానకరమైన ఓటమిని చవి చూసిన తర్వాతే అసలు అత్యవసర పరిస్థితి ఎత్తివేయబడింది.
యాభై ఏళ్ల కిందటి ఎమర్జెన్సీ మనకు నేర్పిన గొప్ప పాఠమేమిటంటే, ప్రజలదే పరమాధికారం (పీపుల్ ఆర్ సుప్రీమ్). వారిని అణచివేసే వారు ఎంతటి శక్తిమంతులైనా, ఎంత గొప్ప వ్యక్తులైనా, అణచి వేయడానికి ఎటువంటి అధికార వ్యవస్థను ఉపయోగించినా ప్రజలు భరించరు. తిరస్కరిస్తారు. తిరగబడతారు. అదే సమయంలో ప్రజల పక్షాన, ప్రజలతో కలిసి సాగించాల్సిన పోరాటాన్ని పట్టుదలగా, ముందుకు తీసుకుపోవాల్సిన అవసరాన్ని కూడా ఇది మనకు గుర్తు చేస్తుంది.
ఎం.ఎ. బేబీ
ఎమర్జెన్సీ : అణచివేత, ప్రతిఘటనల యుగం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES