– మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ – కూలీల ఆవేదన
– సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు..
– గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు..
– పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల డిమాండ్
నవతెలంగాణ – అశ్వారావుపేట
వీబీ జీ రాం జీ(వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్) కూలీల ఇక్కట్లు అన్ని ఇన్ని కావు. పధకం పేరు మార్చి, నిబంధనలు మార్చిన కేంద్ర ప్రభుత్వం కూలీ లకు నాణ్యమైన సేవలు,పనికి తగ్గా వేతనం,కూలీ రోజుల పెంపు లాంటి మాటలు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కూలీల కు అవేమి కనిపించడం లేదు. కొత్త నిబంధనలు ప్రకారం ఎన్ఎంఎంఎస్ యాప్ లో పనికి వచ్చే ప్రతీ కూలీ ని ముఖం గుర్తింపు తో చిత్రం తీయాలి.పని ముగిసాక కూలీల సమూహం చిత్రం తీయాల్సి ఉంటుంది.
అయితే ప్రతిరోజు ఉదయాన్నే పనుల కోసం పంచాయతీ కార్యాలయానికి చేరుకుంటున్నప్పటికీ సాంకేతిక కారణాలతో తమ హాజరు ఆన్లైన్ కావడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్) యాప్ ద్వారా తీయాల్సిన ఫోటోలు సర్వర్ సమస్యల వల్ల సకాలంలో అప్లోడ్ కాకపోవడంతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట మండలం,జమ్మిగూడెం పంచాయతీ పరిధిలో ఈ పథకం పనులకు వెళ్తున్న కూలీలు గురువారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో పని చేసినా కేవలం ఫోటోలు ఆన్లైన్ కాకపోవడం వల్లే తమకు రావాల్సిన రోజువారీ కూలీ డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉందని కూలీలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.నిత్యం ఈ ఫోటోల అప్లోడింగ్,నెట్వర్క్ సమస్యలతో సతమతమవ్వడం కంటే గతంలో మాదిరిగానే పాత పద్ధతిలోనే హాజరు నమోదు ప్రక్రియను కొనసాగించాలని కూలీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కొత్త యాప్ విధానం వల్ల పనులు సజావుగా సాగడం లేదని, వెంటనే ప్రభుత్వం స్పందించి పాత పద్ధతిని అమలు చేసి తమకు పని దినాలు మరియు కూలీ నష్టపోకుండా చూడాలని జమ్మిగూడెం గ్రామ ఉపాధి హామీ కూలీలు విన్నవిస్తున్నారు.



