– పోడు సాగుదారులకు హక్కు పట్టాలివ్వాలి : అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధి హామీ చట్టంలో భాగంగా పనిచేస్తున్న కూలీలకు పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. పనిదినాలను 200 రోజులకు పెంచి రూ.600 కూలి చెల్లించాలనీ, పట్టణ ప్రాంతాలకూ ఉపాధి హామీ చట్టాన్ని విస్తరించాలని కోరారు. పోడు సాగుదారులపై నిర్బంధం ఆపి వారికి హక్కు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ…కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చా ఉపాధి చట్టానికి నిధుల్లో పెద్ద ఎత్తున కోతపెట్టిందని విమర్శించారు. తెలంగాణకు 15 కోట్ల పనిదినాలు అవసరముంటే 6.5 కోట్లకు తగ్గించిందని వాపోయారు. గ్రామీణ ప్రాంతాలను పట్టణాల్లో విలీనం చేసి ఉపాధి పనిని ఎత్తేసే కుట్ర జరుగుతున్నదని విమర్శించారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పనులను చేయిస్తోందనీ, ప్రత్యేక నిధులు కేటాయించిందని తెలిపారు. దేశవ్యాప్తంగానూ ఆ రాష్ట్రం మాదిరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో రెండుసార్లు కూలీల ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలనే నిబంధన దారుణమన్నారు. నెట్లేని ప్రాంతాల్లో అప్లోడ్ కావట్లేదనీ, దాంతో కూలీలు పనిచేసినా వేతనాలు దక్కట్లేదని వాపోయారు. ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ నెంబర్ల లింకు పేరుతో దేశంలో 8.6 కోట్ల మంది ఉపాధి కూలీల కార్డులను మోడీ సర్కారు తొలగించడం దారుణమని విమర్శించారు. కొత్తజాబ్కార్డులు జారీ కాకుండా వెబ్సైట్ను దేశవ్యాప్తంగా లాక్చేయడం అన్యాయమన్నారు. వెబ్సైట్ను అందరికీ అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. పంచాయతీల్లోనే జాబ్కార్డులిచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. పనిప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని విమర్శించారు. ఉపాధి కూలీలు చనిపోతే బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుంటే కేంద్ర మంత్రులు, తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. తాము అధికారంలోకి రాగానే కూలీలకు 150 పనిదినాల కల్పన, రోజుకు రూ.400 కూలి చెల్లింపు హామీని నెరవేర్చాలని సీఎం రేవంత్రెడ్డిని డిమాండ్ చేశారు. భూమిలేని పేదలకు రూ.12 వేలు, కౌలు రైతులకు రూ.15 వేలు, మహిళలకు రూ.2,500 హామీలను కూడా అమలు చేయాలని కోరారు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, ఆఫీస్బేరర్లు మచ్చా వెంకటేశ్వర్లు, నారి ఐలయ్య, బి.ప్రసాద్, ఎ.వీరయ్య, కందుకూరి జగన్, ఎం.నర్సింహులు, ఎం.వెంకటయ్య, బి.సాంబశివ, బి.సమ్మయ్య, లంక రాఘవులు, పెద్ది వెంకట్రాములు, ఎం.ఆంజనేయులు, బి.పద్మ, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి కూలీల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES