పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు
భమ్రాగఢ్ దళ కమాండర్తో పాటు మరో ముగ్గురు మావోయిస్టులు మృతి
నవతెలంగాణ-మహదేవపూర్
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దు గడ్చిరోలి జిల్లాలోని భమ్రాగఢ్ తాలూకాలో గడ్చిరోలి జిల్లా పోలీస్-సీ60 స్పెషల్ టీమ్, సీఆర్పీఎఫ్ సిబ్బంది శుక్రవారం కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు, పోలీసులకు మధ్య దాదాపు 36 గంటలపాటు సాగిన ఎదురుకాల్పుల్లో భమ్రాగఢ్ దళం కమాండర్తో పాటు ముగ్గురు దళ సభ్యులతో కలిపి నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరివద్ద ఒక ఎస్ఎల్, రెండు 303 రైఫిల్స్, ఒక భార్మార్ సహా మొత్తం 4 తుపాకులు, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులను రూపుమాపేందుకు భమ్రాగఢ్ సబ్ డివిజన్ పరిధిలో ఇటీవల కొత్తగా పోలీస్స్టేషన్ను నిర్మిం చారు. దీనిపై మావోయిస్టులు దాడి చేయాలనుకుంటున్నట్టు ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి భద్రతాదళాలకు సమాచారం అందింది.
దాంతో గడ్చిరోలి అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఎం రమేష్ ఆధ్వర్యంలో సీ60 పోలీస్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్లోని 12 బృందాలు, సీఆర్పీఎఫ్ 113 బెటాలియంకు చెందిన పోలీసు బృందాలు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని ఇంద్రావతి నది ఒడ్డున కూంబింగ్ ఆపరేషన్ కోసం గురువారం కవాండే, నెలగొండ పరిసర అడవికి హుటాహుటిన బయలు దేరాయి. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి అడవిలో కూంబింగ్ నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో మృతిచెందిన వారిని.. భామ్రాఘడ్ తాలూకా కవాండే గ్రామానికి చెందిన భామ్రాఘడ్ దళం కమాండర్ సన్ను మాసా పుంగటి(35), దళ సభ్యులు అశోక్ అలియాస్ సురేష్ పోరియా వడ్డే(38), గంగలూరు ఏరియా పోడియాకు చెందిన విజో అలియాస్ విజో హౌయామి(25), భామ్రాఘడ్ గోంగువాడకు చెందిన కరుణ అలియాస్ మమిత అలియాస్ తుని పాండు వర్సే(21)గా గుర్తించారు. కాగా, చనిపోయిన ఈ నలుగురు మావోయిస్టులపై మొత్తం రూ.14లక్షల రివార్డు ఉన్నట్టు తెలిసింది.
గడ్చిరోలిలో మళ్లీ ఎన్కౌంటర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES