Friday, May 16, 2025
Homeఆటలుపోరాటం ముగిసె!

పోరాటం ముగిసె!

- Advertisement -

– ట్రెసా, గాయత్రి జోడీ ఓటమి
– థాయ్‌లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌
బ్యాంకాక్‌ (థాయ్‌లాండ్‌):
ఈ ఏడాది భారత బ్యాడ్మింటన్‌ ఆటగాళ్ల పోరాటానికి వరుసగా మరో టోర్నమెంట్‌లో తెరపడింది. పేలవ ఫామ్‌లో కొనసాగుతున్న భారత షట్లర్లు థారులాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నమెంట్‌లోనూ క్వార్టర్‌ఫైనల్‌కు ముందే ఇంటిముఖం పట్టారు. అగ్రశ్రేణి షట్లర్‌ లక్ష్యసేన్‌ తొలి గేమ్‌లో నిష్క్రమించగా.. వర్థమాన షట్లర్లు క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకోవటంలో తేలిపోయారు. పురుషుల సింగిల్స్‌లో తరుణ్‌ మానెపల్లి 14-21,16-21తో వరుస గేముల్లో రెండో సీడ్‌ అండర్స్‌ ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. 42 నిమిషాల్లో ముగిసిన ప్రీ క్వార్టర్స్‌లో ఆంటోన్సెన్‌ ముందు తరుణ్‌ తేలిపోయాడు. మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా 14-21, 11-21తో టాప్‌ సీడ్‌ పొర్నపవీ చొచువాంగ్‌ (థారులాండ్‌)కు క్వార్టర్స్‌ బెర్త్‌ కోల్పోయింది. 39 నిమిషాల మ్యాచ్‌లో ఉన్నతి హుడా గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించినా.. టాప్‌ సీడ్‌ ఉత్తమ ప్రదర్శన కనబరిచింది. మరో మ్యాచ్‌ ఆకర్షి కశ్యప్‌ 9-21, 14-21తో నాల్గో సీడ్‌ సుపనిద (థారులాండ్‌) చేతిలో పరాజయం పాలైంది. మాళవిక బాన్సోద్‌ సైతం 12-21, 16-21తో ఏడో సీడ్‌ రచనొక్‌ ఇంటనాన్‌ (థారులాండ్‌) చేతిలో చిత్తుగా ఓడింది.
మహిళల డబుల్స్‌లో టైటిల్‌పై ఆశలు రేపిన యువ జోడీ, మూడో సీడ్‌ ట్రెసా జాలి, పుల్లెల గాయత్రి గోపీచంద్‌ గంట పాటు ఉత్కంఠగా సాగిన ప్రీ క్వార్టర్‌ఫైనల్లో పోరాడి ఓడారు. 20-22, 14-21తో వరుస గేముల్లో జపాన్‌ అమ్మాయిలు హిరోకమి, సయాకలు విజయం సాధించారు. తొలి గేమ్‌ను టైబ్రేకర్‌కు తీసుకెళ్లినా.. గాయత్రి, ట్రెసాలు ఒత్తిడిని జయించటంలో విఫలమయ్యారు. కీలక రెండో గేమ్‌లో ఆరంభం నుంచీ తడబాటుకు గురైన గాయత్రి, ట్రెసా ద్వయం 53 నిమిషాల్లోనే క్వార్టర్‌ఫైనల్‌ బెర్త్‌ను ప్రత్యర్థికి కోల్పోయారు. ఐదు విభాగాల్లో భారత షట్లర్లు ప్రీ క్వార్టర్‌ఫైనల్లోనే నిష్క్రమించగా.. థారులాండ్‌ ఓపెన్‌లో భారత పోరాటం ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -