4 పరుగులతో నేపాల్పై గెలుపు
ఇంగ్లాండ్ 184/7, నేపాల్ 180/6
ముంబయి : ఐసీసీ టీ20 ప్రపంచకప్లో పసికూనలు గర్జిస్తున్నాయి. నెదర్లాండ్స్, అమెరికా ఆకట్టుకునే ప్రదర్శన చేయగా.. నేపాల్ ఓ అడుగు ముందుకేసింది. మాజీ చాంపియన్ ఇంగ్లాండ్పై దాదాపు విజయం సాధించినంత పని చేసింది. ఆదివారం ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన గ్రూప్-సి మ్యాచ్లో ఇంగ్లాండ్ గట్టెక్కింది. ఉత్కంఠభరిత మ్యాచ్లో 4 పరుగుల తేడాతో నేపాల్పై గెలుపొందింది. 185 పరుగుల ఛేదనలో నేపాల్ బ్యాటర్లు దంచికొట్టారు. ఇంగ్లాండ్ స్టార్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, మార్క్వుడ్లపై వరుస ఓవర్లలో 22, 14 పరుగులు పిండుకున్న నేపాల్.. ఆఖరు ఓవర్లో విజయానికి 10 పరుగుల దూరంలో నిలిచింది. శామ్ కరణ్ గొప్పగా బంతులేసి.. నేపాల్ను నిలువరించాడు.
ఓపెనర్ కుశాల్ భూర్టెల్ (29, 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (39, 34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు), దీపేంద్ర సింగ్ (44, 29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), లోకేశ్ (39 నాటౌట్, 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్లతో రాణించారు. 185 పరుగుల ఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. అగ్ర జట్టు ఇంగ్లాండ్ను వణికించి.. స్వదేశంలో అభిమానుల సంబురాలకు తెరతీసింది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు చేసింది. జాకబ్ బెతెల్ (55, 35 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు), హ్యారీ బ్రూక్ (53, 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) అర్థ సెంచరీలతో రాణించారు. విల్ జాక్స్ (39 నాటౌట్, 18 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్లు), జోశ్ బట్లర్ (26, 17 బంతుల్లో 5 ఫోర్లు) మెరిశారు. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ (1/7, 39) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.



