Saturday, June 28, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్నేటినుంచి ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌

నేటినుంచి ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌

- Advertisement -

జులై 1 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
10 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదు
13న మాక్‌ సీట్ల కేటాయింపు
18న తొలివిడత సీట్ల కేటాయింపు
షెడ్యూల్‌ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ్ల 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఎప్‌సెట్‌ (ఎంసెట్‌) తొలివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ వి బాలకిష్టారెడ్డి అధ్యక్షతన ఎప్‌సెట్‌ ప్రవేశాల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఎప్‌సెట్‌ ప్రవేశాల కన్వీనర్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. శనివారం నుంచి వచ్చేనెల ఏడో తేదీ వరకు ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందనీ, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించొచ్చనీ, ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని సూచించారు. అదేనెల ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు. అదేనెల ఆరు నుంచి పదో తేదీ వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశముందని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి మొదటిసారిగా జోసా తరహాలో మాక్‌ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చేనెల 13న మాక్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా సీట్లు కేటాయిస్తామని వివరించారు. అదేనెల 14,15 తేదీల్లో ఆప్షన్ల మార్పులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఒకవేళ మార్పులు చేయకుంటే వాటినే మొదటివిడత వెబ్‌ఆప్షన్లుగా పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. వచ్చేనెల 18న ఎప్‌సెట్‌ తొలివిడత ప్రవేశాలకు సంబంధించిన సీట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. అదేనెల 18 నుంచి 22 వరకు ట్యూషన్‌ ఫీజు చెల్లించాలనీ, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని సూచించారు.
జులై 25 నుంచి రెండోవిడత కౌన్సెలింగ్‌
వచ్చేనెల 25 నుంచి ఎప్‌సెట్‌ ప్రవేశాల రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని శ్రీదేవసేన తెలిపారు. అదేనెల 25న ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందనీ, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించొచ్చనీ, ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. అదేనెల 26న ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు. వచ్చేనెల 26,27 తేదీల్లో వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశముందని పేర్కొన్నారు. మొదటి విడతలో నమోదు చేసిన వెబ్‌ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోబోమనీ, కొత్తగా ఆప్షన్లను తప్పనిసరిగా నమోదు చేయాలని కోరారు. వచ్చేనెల 30న ఎప్‌సెట్‌ రెండోవిడత ప్రవేశాలకు సంబంధించిన సీట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. అదేనెల 30 నుంచి ఆగస్టు ఒకటో తేదీ వరకు ట్యూషన్‌ ఫీజు చెల్లించాలనీ, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని సూచించారు.వచ్చేనెల 31 నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు కేటాయించిన కాలేజీల్లో భౌతికంగా రిపోర్టు చేయాలని కోరారు. ఆగస్టు మూడో తేదీ నాటికి విద్యార్థుల ప్రవేశాల వివరాలను కాలేజీ యాజమాన్యాలు అప్‌డేట్‌ చేయాలని ఆదేశించారు. ఒరిజినల్‌ టీసీ, ఇతర జిరాక్స్‌ ధ్రువపత్రాలను కాలేజీల్లో అందజేయాలని తెలిపారు. రెండో విడతలో కాలేజీల్లో రిపోర్టు చేయని అభ్యర్థులకు తుది విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు.
ఆగస్టు 5 నుంచి తుదివిడత కౌన్సెలింగ్‌
ఆగస్టు ఐదో తేదీ నుంచి ఎప్‌సెట్‌ ప్రవేశాల తుదివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని శ్రీదేవసేన తెలిపారు. అదేనెల ఐదో తేదీన ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందనీ, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించొచ్చనీ, ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. అదేనెల ఆరున ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు. ఆగస్టు ఆరు, ఏడు తేదీల్లో వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశముందని పేర్కొన్నారు. అదేనెల పదో తేదీన సీట్లు కేటాయిస్తామని తెలిపారు. అదేనెల పది నుంచి 12 వరకు ట్యూషన్‌ ఫీజు చెల్లించాలనీ, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని సూచించారు. ఆగస్టు 11 నుంచి 13వ తేదీ వరకు కేటాయించిన కాలేజీలు లేదా మారిన బ్రాంచీల్లో రిపోర్టు చేయాలని కోరారు. 14వ తేదీ వరకు విద్యార్థుల ప్రవేశాల వివరాలను కాలేజీ యాజమాన్యాలు అప్‌డేట్‌ చేయాలని ఆదేశించారు. కేంద్రీకృత అంతర్గత స్లైడింగ్‌ విధానం ఆగస్టు 18, 19 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఆయా తేదీల్లో వెబ్‌ఆప్షన్లను నమోదు చేయాలని సూచించారు. ఈ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఆగస్టు 22న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. అదేనెల 22, 23 తేదీల్లో ఆ కాలేజీలో రిపోర్టు చేయాలని సూచించారు. ఆగస్టు 23న స్పాట్‌ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం https://tgeapcet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -