Wednesday, December 31, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుమే 4 నుంచి ఎప్‌సెట్‌

మే 4 నుంచి ఎప్‌సెట్‌

- Advertisement -

11 వరకు రాతపరీక్షల నిర్వహణ
అదేనెల 12న ఎడ్‌సెట్‌, 13,14 తేదీల్లో ఐసెట్‌
15న ఈసెట్‌, 18న లాసెట్‌
28 నుంచి 31 వరకు పీజీఈసెట్‌,
31 నుంచి పీఈసెట్‌ : ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ సహా వివిధ వృత్తి విద్య, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధిం చిన ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. మంగళవారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ వి బాలకిష్టారెడ్డి, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. బీఈ, బీటెక్‌, బీ ఫార్మసీ, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ (టీజీఎప్‌) సెట్‌ మే నాలుగు నుంచి 11 వరకు రాతపరీక్షలు జరుగుతాయి. ఇందులో మే నాలుగు, ఐదు తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ రాతపరీక్షలు, తొమ్మిది నుంచి 11 వరకు ఇంజినీరింగ్‌ విభాగం రాపరీక్షలను నిర్వహిస్తారు. ఈఏపీసెట్‌ను జేఎన్టీయూ హైదరాబాద్‌ నిర్వహిస్తుంది. బీఈడీ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించే ఎడ్‌సెట్‌ పరీక్ష మే 12న ఉంటుంది. దీన్ని కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఐసెట్‌ పరీక్షలు అదేనెల 13,14 తేదీల్లో జరుగుతాయి. దీన్ని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. మే 15న ఈసెట్‌ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. అదేనెల 18న మూడేండ్ల లా కోర్సు, ఐదేండ్ల లా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్‌ జరుగుతుంది. అదే రోజు పీజీలాసెట్‌ను నిర్వహిస్తారు. లాసెట్‌, పీజీ లాసెట్‌లను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. ఎంఈ, ఎంటెక్‌, ఎం ఫార్మసీ, ఎంఆర్క్‌, ఫార్మాడీ (పీబీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్‌ పరీక్షలు మే 28 నుంచి 31 వరకు జరుగుతాయి. పీజీఈసెట్‌ను జేఎన్టీయూ హైదరాబాద్‌ నిర్వహిస్తుంది. బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీఈసెట్‌ పరీక్షలు మే 31 నుంచి జూన్‌ మూడో తేదీ వరకు జరుగుతాయి. దీన్ని శాతవాహన విశ్వవిద్యా లయం నిర్వహిస్తుంది.

స్టూడెంట్‌ ఫ్రెండ్లీగా నిర్వహిస్తాం : బాలకిష్టారెడ్డి
ప్రవేశ పరీక్షలకు స్టూడెంట్‌ ఫ్రెండ్లీగా నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ వి బాలకిష్టారెడ్డి చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు. గతేడాది ఉన్న ఫీజులను కొనసాగించామని అన్నారు. వచ్చేనెల మొదటి వారంలో ప్రవేశ పరీక్షల కమిటీలను నియమిస్తామని చెప్పారు. ఆ తర్వాత సమావేశాలుంటాయని వివరించారు. హాల్‌టికెట్లపై జియోట్యాగింగ్‌ ముద్రిస్తామనీ, దాని వల్ల ఇంటి నుంచి పరీక్షా కేంద్రానికి మధ్య ఉన్న దూరం తెలుస్తుందని అన్నారు. ఎంత సమయంలో చేరుకోవచ్చో తెలుసుకోవచ్చని వివరించారు. ఎప్‌సెట్‌ సీట్ల కేటాయింపు సమయంలో మాక్‌ కౌన్సెలింగ్‌ మంచి ఫలితాన్ని ఇచ్చిందన్నారు. ఇప్పటికే ప్రవేశ పరీక్షల కన్వీనర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఎప్‌సెట్‌ కన్వీనర్‌గా కె విజయకుమార్‌రెడ్డి, ఎడ్‌సెట్‌ కన్వీనర్‌గా బి వెంకట్రామ్‌రెడ్డి, ఐసెట్‌ కన్వీనర్‌గా అలువాల రవి, ఈసెట్‌ కన్వీనర్‌ పి చంద్రశేఖర్‌, లాసెట్‌ కన్వీనర్‌ బి విజయలక్ష్మి, పీజీఈసెట్‌ కన్వీనర్‌గా కె వెంకటేశ్వరరావు, పీఈసెట్‌ కన్వీనర్‌గా రాజేష్‌కుమార్‌ను నియమించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -