Friday, July 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరోడ్డు సేఫ్టీ క్లబ్‌లు ఏర్పాటు చేయండి

రోడ్డు సేఫ్టీ క్లబ్‌లు ఏర్పాటు చేయండి

- Advertisement -

– డీటీసీ కుమారి ఆఫ్రిన్‌ సిద్ధికి, ఆర్టీవో ఎం.పురుషోత్తమ్‌రెడ్డి
– ఐటీఐ మల్లేపల్లిలో రహదారి భద్రతపై అవగాహన సదస్సు
నవతెలంగాణ-సిటీబ్యూరో

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘రోడ్డు సేఫ్టీ క్లబ్‌లు’ ఏర్పాటు చేయాలని రవాణాశాఖ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ కుమారి ఆఫ్రిన్‌ సిద్ధికి, ఆర్టీవో ఎం.పురుషోత్తమ్‌రెడ్డి చెప్పారు. రవాణాశాఖ హైదరాబాద్‌ సెంట్రల్‌జోన్‌ ఆధ్వర్యంలో గురువారం మల్లేపల్లి గవర్నమెంట్‌ ఐటీఐ కాలేజీలో రహదారి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆఫ్రిన్‌ సిద్దికి మాట్లాడుతూ.. రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించడమేగాక ఇతరులకు కూడా వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయాలని సూచించారు. రోడ్‌ సేఫ్టీ క్లబ్‌ ఏర్పాటుతో రహదారి భద్రత కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకుపోవాలన్నారు. ప్రమాదరహిత రాష్ట్రంగా చేయాలన్నారు. ఆర్టీవో ఎం.పురుషోత్తమ్‌రెడ్డి మాట్లాడుతూ.. రహదారి భద్రత మనందరి బాధ్యతగా భావించాలన్నారు. నియమ నిబంధనలను మనం పాటించడమేగాక ఇతరులూ పాటించే విధంగా చూడాలని కోరారు. మోటార్‌ సైకిల్‌ నడిపేటప్పుడు హెల్మెట్‌, కారు నడిపేటప్పుడు సీటు బెల్టు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. మైనర్లకు వాహనం ఇవ్వొద్దని, లేనిపక్షంలో చట్టప్రకారం వారి తల్లిదండ్రులూ శిక్షార్హులని వివరించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణం కాపాడే వారికి ‘గుడ్‌ సమరీటాన్‌’ పేరిట కేంద్ర ప్రభుత్వం తగిన పారితోషికంతో ప్రోత్సహిస్తుందని తెలిపారు. ప్రమాద రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలు చేస్తోందని, ప్రతి ఒక్కరూ రహదారి భద్రత, ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని కోరారు. అందరూ తప్పనిసరిగా డ్రైవింగ్‌ లైసెన్స్‌లు తీసుకోవాలని, ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని టీవో శ్రీనివాస్‌, సీనియర్‌ టీవో కృష్ణయాదవ్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్‌ ఐటీఐ ప్రిన్సిపల్‌ శైలజ, ఎంవీఐ గంటా రవీందర్‌, ఐటీఐ కార్యాలయ టీవో, ఏటీవోలు, సిబ్బంది, ఐటీఐ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -