Wednesday, June 18, 2025
E-PAPER
Homeఆటలువర్క్‌లోడ్‌తోనే వద్దనుకున్నా!

వర్క్‌లోడ్‌తోనే వద్దనుకున్నా!

- Advertisement -

టెస్టు కెప్టెన్సీపై జశ్‌ప్రీత్‌ బుమ్రా
లండన్‌ (ఇంగ్లాండ్‌) :
బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో రవిచంద్రన్‌ అశ్విన్‌ వీడ్కోలు పలుకగా.. ఐపీఎల్‌18 సమయంలో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి టెస్టుల నుంచి తప్పుకున్నారు. కెప్టెన్‌, మాజీ కెప్టెన్‌ రిటైర్‌మెంట్‌తో భారత్‌ నాయకత్వ సంక్షోభంలో కూరుకుంది. ఆస్ట్రేలియాతో తొలి, ఆఖరు టెస్టుల్లో కెప్టెన్సీ వహించి విమర్శకుల మెప్పు పొందిన జశ్‌ప్రీత్‌ బుమ్రా తదుపరి సారథిగా వస్తాడని అందరూ ఊహించారు. కానీ యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ను బీసీసీఐ కెప్టెన్‌గా ఎంచుకుంది. కెప్టెన్సీ రేసులో నిలిచినా జశ్‌ప్రీత్‌ బుమ్రాను పక్కనపెట్టడంపై పలు కథనాలు వెలువడ్డాయి. టెస్టు కెప్టెన్సీ అంశంపై పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా తొలిసారి స్పందించాడు. ఇంగ్లాండ్‌ పర్యటనలో టెండూల్కర్‌-అండర్సన్‌ ట్రోఫీ ప్రసారదారుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దినేశ్‌ కార్తీక్‌కు బుమ్రా పలు విషయాలు వెల్లడించాడు.
ఎప్పుడైనా టీమ్‌ ఫస్ట్‌ :
‘కెప్టెన్సీ అంశంలో ఎటువంటి ఆసక్తికర కథలు లేవు. నన్ను పక్కనపెట్టారు, నన్ను తీసేశారు అంటూ ఎటువంటి వివాదం, పతాక శీర్షికలకు తావు లేదు. రోహిత్‌, విరాట్‌ వీడ్కోలుకు ముందే ఐపీఎల్‌ సందర్భంగా ఇంగ్లాండ్‌లో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌పై బీసీసీఐతో మాట్లాడాను. నా ఫిట్‌నెస్‌ పర్యవేక్షకులు, నాకు శస్త్రచికిత్స చేసి వైద్యుడిని సైతం సంప్రదించాను. నేను ఓ నిర్ణయానికి రావడానికి ముందే అందరితో మాట్లాడాను. నా వర్క్‌లోడ్‌ విషయంలో నేను తెలివిగా ఉండాలనే అంశంపై నాకు స్పష్టత వచ్చింది. ఇదే విషయాన్ని ఫోన్‌ చేసి బీసీసీఐకి చెప్పాను. టెస్టు కెప్టెన్సీ అంశంలో నన్ను పరిగణనలోకి తీసుకోవద్దని అన్నాను. ఆ సమయంలో కెప్టెన్‌గా బీసీసీఐ నావైపు చూసింది. అప్పుడు నేను ‘నో’ చెప్పాను. ఎందుకంటే ఐదు టెస్టుల సిరీస్‌లో నేను మూడు మ్యాచులే ఆడతానని చెప్పటం డ్రెస్సింగ్‌రూమ్‌లో మంచి సందేశం ఇవ్వబోదు. జట్టుకు అది ఏమాత్రం మంచిది కాదు. నేను ఎప్పుడూ టీమ్‌ ఫస్ట్‌. అందుకే టెస్టు కెప్టెన్సీ వద్దనుకున్నాను’ అని బుమ్రా అన్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -