– ఏడాదిన్నరలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఏడాదిన్నర కాలంలో రూ.3లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు అన్నారు. మంగళవారం నానక్రామ్గూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో యూఎస్కు చెందిన ”ఎవర్జెంట్ టెక్నాలజీస్” గ్లోబల్ వాల్యూ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్వాంటం లాంటి ఎవర్జెంట్ టెక్నాలజీస్కు హబ్గా తెలంగాణను మార్చేందుకు ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా 200 ఎకరాల్లో ఏఐ సిటీని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయబోతున్నామని చెప్పారు. ఏటా రాష్ట్రంలో 2 లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పట్టా తీసుకుంటున్నారనీ, కానీ వీరిలో చాలా మందికి పరిశ్రమలకు అవసరమైన కనీస నైపుణ్యాలు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.. ఆవిష్కరణలకు హబ్ గా తెలంగాణను మార్చేందుకు కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే యువతకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు. హైదరాబాద్లో కార్యాలయాన్ని ప్రారంభించిన ”ఎవర్జెంట్ టెక్నాలజీస్” యాజమాన్యానికి ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి భవానిశ్రీ, ఐటీ సలహాదారు సాయి కృష్ణ, ఎవర్జెంట్ టెక్నాలజీస్ ఫౌండర్, సీఈవో విజరు సజ్జ తదితరులు పాల్గొన్నారు.
ఎవర్జెంట్ టెక్నాలజీస్గ్లోబల్ హబ్గా తెలంగాణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES