పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్.. డ్రోన్లతో నిఘా: జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
జూబ్లీహిల్స్ బైపోల్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్లో 4,01,365 ఓటర్లు ఉన్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారని.. ఓటర్లు ముందుకు వచ్చి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ స్టేషన్లలో 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని అన్నారు. పోలింగ్ను డ్రోన్ల ద్వారా పరిశీలిస్తామని చెప్పారు. ఈసారి 4 బ్యాలెట్ యూనిట్లు వాడుతున్నామని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల దగ్గర సీసీ కెమెరాలు అమర్చామని అన్నారు. 2,060 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారని, 561 కంట్రోల్ యూనిట్లు, 595 వీవీ ప్యాట్స్, 2,394 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పోలింగ్ స్టేషన్స్ నుంచి వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందన్నారు.
అన్ని పోలింగ్ స్టేషన్స్ దగ్గర హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నవంబర్ 11న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనున్నదని, పోలింగ్ స్టేషన్ల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగర జాయింట్ సీపీ ఇక్బాల్ మాట్లాడుతూ.. నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం బందోబస్తు ఇస్తున్నామని చెప్పారు. సీఐఎస్ఎఫ్ నుంచి 8 కంపెనీల బలగాలు వచ్చాయన్నారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకుని ఓటు పండుగలో పాల్గొనాలని సూచించారు. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం సందర్భంగా మొత్తం 27 రకాల కేసులు నమోదయ్యాయని చెప్పారు. వీటిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రూ.3.60 కోట్ల నగదు పట్టుకున్నామని చెప్పారు.



