స్పష్టం చేసిన ట్రంప్
వాషింగ్టన్ : వాణిజ్య భాగస్వా ములపై విధించిన సుంకాల అమలు ను 90 రోజుల పాటు వాయిదా వేస్తూ గతంలో ఇచ్చిన గడువును తిరిగి పొడిగించే ఆలోచన ఏదీ లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. సుంకాల విధింపును ఆయన ఈ నెల 9 తేదీ వరకూ వాయిదా వేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ గడువు లోగానే విభేదాలను పరిష్కరించుకునేందుకు భారత ప్రతినిధి బృందం వాషింగ్టన్లోనే ఉంటూ ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
భారత్, అమెరికా అధికారుల మధ్య గత నెల 27వ తేదీ వరకూ చర్చలు జరగాల్సి ఉంది. అయితే మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదురుతుందేమోన్న ఆశతో భారత ప్రతినిధి బృందం తన వాషింగ్టన్ పర్యటనను కొనసాగిస్తోంది. భారత్పై అదనంగా 26 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా ఏప్రిల్ 2వ తేదీన ప్రకటించింది. అయితే ఈ అదనపు సుంకాల నుండి పూర్తి మినహాయింపు ఇవ్వాలని భారత్ కోరుతోంది.
సుంకాల విధింపుకు 90 రోజుల విరామం ప్రకటించిన అమెరికా, అప్పటికే విధించిన పది శాతం బేస్లైన్ టారిఫ్ను కొనసాగిస్తోంది. ఈ నెల 8వ తేదీ నాటికి చర్చలు ఫలప్రదం కాని పక్షంలో మన దేశానికి మరిన్ని టారిఫ్ ఒత్తిడులు ఎదురవుతాయి. ఇదిలావుండగా గడువును పొడిగించే ఆలోచన ఏదీ తాను చేయడం లేదని ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ స్పష్టం చేశారు. ఆ అవసరం ఉన్నదని తాను భావించడం లేదని కూడా చెప్పారు. సుంకాలపై వివిధ దేశాలకు త్వరలోనే లేఖలు పంపుతామని తెలిపారు. ‘మమ్మల్ని ఇతర దేశాలు..అవి మంచివైనా, చెడ్డవైనా… ఏ విధంగా చూస్తున్నాయో పరిశీలిస్తాం. మేము కొన్ని దేశాలను పట్టించుకోము’ అని అన్నారు.
వివిధ దేశాలకు అమెరికా ప్రభుత్వం పంపుతున్న లేఖల్లో ఏముందంటే…’అభినందనలు. అమెరికాలో వ్యాపారం చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తున్నాం. మీరు 25 శాతమో లేదా 35 శాతమో లేదా 50 శాతమో లేదా 10 శాతమో సుంకం చెల్లించాల్సి ఉంటుంది’. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోని దేశాలపై అధిక సుంకం విధిస్తారు. మొత్తంగా 200 దేశాలు ఉన్నాయని, వాటన్నింటితోనూ మాట్లాడల ేమని ట్రంప్ చెప్పారు. 90 రోజుల గడువులో 90 దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని తొలుత అమెరికా అనుకుంది. భారత్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి అమెరికా అనేక కీలక డిమాండ్లు చేసింది. అయితే వీటిని మన అధికారులు అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది.