ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆగస్టు 15న గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ సచివాలయంలో సీనియర్ అధికారులతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లా డుతూ పంద్రాగస్టు రోజు ఉదయం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పిస్తారనీ, అనంతరం గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారని చెప్పారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లపై అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా రూట్ మ్యాప్ను సిద్ధం చేయాలని సూచించారు. పండుగ స్ఫూర్తిని ప్రతిబింబించేలా తెలంగాణ శాసనసభ, హైకోర్టు, రాజ్ భవన్, సచివాలయం, తెలంగాణ తల్లి విగ్రహాలు వంటి ప్రముఖ ప్రభుత్వ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర వారసత్వం, దేశ భక్తిని ప్రదర్శించే కార్యక్రమాలను నిర్వహించాలని సాంస్కృతిక శాఖను సూచించారు. అగ్నిమాపక భద్రతా సిబ్బంది అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు. అంత రాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీజీపీ జితేందర్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, సమాచారశాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
స్వాతంత్య్రదినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు
- Advertisement -
- Advertisement -