ప్రశాంత్ కిషోర్పై ఎంపీ చామల కిరణ్ ఫైర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రశాంత్ కిషోర్ (పీకే) ఫెయిల్డ్ పొలిటికల్ అనలిస్టు అని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన తన ఎక్స్ వేదికగా ఒక వీడి యో విడుదల చేశారు. ‘భారతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇతర రాజకీయ నాయకులపై విమర్శ లతో రాజకీయాలు చేస్తూ గొప్పవారనే భ్రమలో జీవిస్తు న్నారు. మీరు కొన్ని రాష్ట్రాల్లో ఫెయిల్ అయిన పొలిటికల్ అనలిస్ట్, ఇప్పుడు ‘జన్ సూరాజ్’ పార్టీతో బీహార్ ప్రజలను ఆకర్షించాలను కుంటున్నారు కానీ మీ సిద్ధాంతాలు అక్కడి రాజకీయంలో పని చేయలేకపోతున్నాయి’ అని పేర్కొన్నారు. ప్రజల దృష్టిని తమ వైపునకు తిప్పుకునేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీహార్ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి పేరును వాడటం సరైన పద్ధతి కాదని సూచించారు. బీహార్ అభివృద్ధి కోసం ఏం చేస్తారో చెప్పకుండా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను విమర్శించడం సరైనది కాదని ఆయన హితవు పలికారు.
పొలిటికల్ బ్రోకర్ : టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్
ప్రశాంత్ కిషోర్ (పీకే) ఒక పొలిటికల్ బ్రోకర్ అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ విమర్శించారు. ఆయనకు రాజకీయ అనుభవం, అవగాహన లేదని చెప్పారు. ఆయన తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డిని ఓడిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. శనివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి, తిరుగుబాటుకు ప్రతీక అన్నారు. ఇక్కడి ప్రజలకు పొలిటికల్ బ్రోకర్ల అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలు బ్రోకర్లకు, జోకర్లకు, దళారులకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఆయన స్థాపించిన జన సురాజ్ పార్టీ బీహార్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. తమ సొంత రాష్ట్రంలో ప్రజల నమ్మకాన్ని పొంద లేని ఆయన… ఇతర రాష్ట్రాల రాజకీయా లపై మాట్లాడటం హాస్యాస్పదమని చెప్పారు. కేవలం పబ్లిసిటీ కోసమే రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. పీకే కాదు కదా, ఆయన జేజమ్మ వచ్చినా కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరని హెచ్చ రించారు. త్వరలోనే బీహార్ ప్రజలు తమ రాష్ట్రం నుంచి పీకే వంటి దళారులను తరిమి కొడతారని తెలిపారు.