Sunday, June 1, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలునకిలీ పత్తి విత్తనాల దందా

నకిలీ పత్తి విత్తనాల దందా

- Advertisement -

– 9 మంది అరెస్ట్‌.. పరారీలో మరో ఇద్దరు
– రూ.14 లక్షల విలువైన 560 కేజీల నకిలీ సీడ్స్‌ స్వాధీనం
– కట్టడికి టాస్క్‌ఫోర్స్‌ బృందాలు : విలేకరుల సమావేశంలో ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌
నవతెలంగాణ-ఏన్కూర్‌

ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాల దందా సాగుతోంది. ఖమ్మం పోలీసులు అప్రమత్తమై కుటీర పరిశ్రమగా వర్ధిల్లుతున్న నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రంపై శుక్రవారం దాడులు చేశారు. మూడు వేర్వేరు చోట్ల పోలీసులు జరిపిన దాడుల్లో రూ.14 లక్షల విలువైన 560 కేజీల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. 9 మందిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. దీనిపై ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌ శుక్రవారం ఏన్కూరు పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 28వ తేదీ ఉదయం ఏన్కూర్‌ పోలీసులు, వ్యవసాయ అధికారుల ఉమ్మడి తనిఖీల్లో భాగంగా ఏన్కూర్‌ గ్రామానికి చెందిన జి.నరసింహారావు కొద్దిమంది రైతులకు అనుమతిలేని పత్తి విత్తనాలను అమ్ముతున్నారనే సమాచారం మేరకు తనిఖీ నిర్వహించగా 450 గ్రాముల అడ్వాన్స్‌ 555 పేర్లతో పత్తి విత్తనాల ప్యాకెట్లు దొరకగా సీజ్‌ చేశారు. కల్లూరు ఎస్‌ఐ డి.హరిత ఒక టీమ్‌ ఏర్పాటు చేసి తదుపరి విచారణ చేయగా ఈ పత్తి విత్తనాలను ఆంధ్రప్రదేశ్‌లోని మైలవరం మండలం చంద్రుగూడెం గ్రామానికి చెందిన శాలివాహన అనే వ్యక్తి వద్ద నుంచి తెచ్చి అమ్ముతున్నట్టు తేలింది. 450 గ్రాముల ప్యాకెట్లను అక్కడ రూ.400కు కొనుక్కొచ్చి ఇక్కడ రూ.1,200కు అమ్ముతున్నట్టు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై ఖమ్మం సీపీ ఆదేశాల మేరకు కల్లూరు ఎస్‌ఐ డి.హరిత ఆధ్వర్యంలో ఒక టీమ్‌.. మైలవరం మండలం చంద్రుగూడెం గ్రామానికి వెళ్లింది. శాలివాహన ఇంటి వద్ద ఒక కుటీర పరిశ్రమలాగా నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. అతను కర్నాటక నుంచి పత్తి విత్తనాలను, వాటిని ట్యాగ్‌ చేయడానికి ప్రింటెడ్‌ అడ్వాన్స్‌ త్రిబుల్‌ ఫై నెంబర్‌ గల కవర్‌ ఉన్న ప్యాకెట్స్‌తో తీసుకొచ్చి తన వద్ద ఉన్న విత్తనాలను రైజోబెల్‌ మిశ్రమాన్ని కలిపి ఆరబెట్టి ఆ పత్తి విత్తనాలను ప్యాకెట్లలో నింపి సీల్‌ చేసి అమ్ముతున్నారు. జి. నరసింహారావు, మరి కొంతమంది ఏజెంట్ల ద్వారా రైతులకు అధిక దిగుబడి వస్తుందని, అలాగే కలుపుమందు వల్ల ఇబ్బంది ఉండదని నమ్మించి ఒక్కొక్క ప్యాకెట్‌ను రూ.1200కు రైతులకు అమ్ముతున్నారని తెలిసింది. అతని ఇంటి వద్ద నుంచి ఒక క్వింటా కలిపి పెట్టిన రైజోబెల్‌ మిశ్రమం, ప్యాక్‌ చేయకుండా ఉన్న పత్తి విత్తనాలు, 450గ్రాముల బరువు కలిగి అరుణోదయ లేబుల్‌తో ఉన్న 272 పత్తి విత్తన ప్యాకెట్లను, ప్యాకెట్‌ సీల్‌ చేయడానికి వాడే రెండు మిషన్లు, ఒక వేయింగ్‌ మిషన్‌, పత్తి విత్తనాలు ప్యాకింగ్‌ చేయడానికి అరుణోదయ లేబుల్‌తో ఉన్న సుమారు 400 ఖాళీ ప్యాకెట్లు, రెండు లీటర్ల రైజోబెన్‌ మిశ్రమాన్ని సీజ్‌ చేశారు.
అలాగే రేపల్లెవాడ గ్రామ శివారున నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు వెనిగండ్ల శ్రీహరిరావు అనే వ్యక్తి వ్యవసాయ భూమిలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ 210 కిలోల నకిలీ పత్తి విత్తనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తదుపరి వెనిగండ్ల శ్రీధర్‌రావు ఇచ్చిన సమాచారం మేరకు అతని అనుచరుడైన కిషోర్‌ ఇంటి వద్ద తనిఖీ చేయగా సుమారు 120 కిలోల పత్తి విత్తనాలు లభించాయి. అలాగే పత్తి విత్తనాలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్న రైజోబిన్‌ కెమికల్‌, వేయింగ్‌ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. శ్రీహరిరావు కొంతకాలంగా బాపట్ల జిల్లాలో ఉన్న తన బంధువైన లక్ష్మీనారాయణ ద్వారా కిలో రూ.800కి నకిలీ, ఎటువంటి అనుమతి లేని విత్తనాలు తెప్పిస్తూ ఏన్కూరు మండల రైతులకు అధిక దిగుబడి వస్తున్న వంగడాలని నమ్మించి కిలో రూ.2,600 అమ్ముతూ లాభాలు గడిస్తున్నారని విచారణలో తెలిసింది. శుక్రవారం ఏన్కూర్‌ ఎస్‌ఐ రఫీకి వచ్చిన సమాచారం మేరకు ఏన్కూరులో పి. కోటేశ్వరరావు ఇంటి వద్ద తనిఖీ చేయగా అతని వద్ద నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు 20 లభించాయి. అతన్ని విచారించగా ఏపీలోని తెనాలి జిల్లా నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారని తెలిసింది. ఈ సంఘటనకు సంబంధించి వి.శ్రీహరిరావు, యు.నరేష్‌, అన్నెం లక్ష్మీనారాయణ, జి.గోపి, వి.రమేశ్‌, టి.నవీన్‌, డి.రమేష్‌, జి.నరసింహారావు, సిహెచ్‌ శాలివాహన, పి.కోటేశ్వరరావు, వి.రవిలపై కేసులు నమోదయ్యాయని వీరిలో 9మందిని అరెస్ట్‌ చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఎవరైనా ప్రముఖ బ్రాండెడ్‌ కంపెనీల విత్తనాల పేరుతో నాసిరకం, నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని సీపీ తెలిపారు. ముఖ్యంగా రైతులు విత్తనాలు కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ధరలకు తెలియని వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి మోసపోవద్దని అన్నారు. కొంతమంది దళారులు ముఠాలుగా ఏర్పడి తక్కువ డబ్బుకు విత్తనాలు ఇస్తామని ఆశ చూపి రైతులను మోసం చేస్తారని, ఇటువంటి వారిపై గ్రామాల్లో సైతం నిఘా పెట్టామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కల్లూరు ఏసీపీ రఘు, సత్తుపల్లి రూరల్‌ సీఐ ముత్తులింగం, ఎస్‌ఐ రఫీ, ఎస్‌ఐ హరిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -