హార్దిక్, అభిషేక్తో సెల్ఫీలకు అత్యుత్సాహం
నవతెలంగాణ-హైదరాబాద్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్లో ఆడుతున్న అభిమాన క్రికెటర్లను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ముస్తాక్ అలీ ఎలైట్ గ్రూప్-సి మ్యాచ్లు హైదరాబాద్లో జరుగుతున్నాయి. మంగళవారం బరోడా, పంజాబ్ మ్యాచ్కు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వగా.. అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి వచ్చారు. హెచ్సీఏ అధికారులు అభిమానుల కోసం ఓ స్టాండ్ను మాత్రమే అనుమతించినా.. లోపలకి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ ఇతర స్టాండ్స్లోకి వెళ్లారు. హార్దిక్ పాండ్య, అభిషేక్ శర్మతో సెల్ఫీల కోసం ఔత్సాహిక అభిమానులు ఫెన్సింగ్ దూకి గ్రౌండ్లోకి ప్రవేశించటం ఆందోళనకు దారితీసింది.
ముగ్గురు అభిమానులు గ్రౌండ్లోకి వచ్చిన హార్దిక్ పాండ్యతో ఫోటోలు దిగగా.. ఓ అభిమాని అభిషేక్ శర్మ కోసం పిచ్పైకి వచ్చాడు. పోలీసులు అప్రమత్తం అయ్యేలోపే అభిమానులు క్రికెటర్లను కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. ఇక పంజాబ్, బరోడా మ్యాచ్లో బరోడా 7 వికెట్లతో గెలుపొందింది. అభిషేక్ శర్మ (50), అన్మోల్ప్రీత్ (69) రాణించగా తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 222/8 పరుగులు చేసింది. ఛేదనలో హార్దిక్ పాండ్య (77 నాటౌట్, 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లు) ధనాధన్ జోరు చూపించగా మరో ఐదు బంతులు ఉండగానే బరోడా లాంఛనం ముగించింది. గ్రూప్-సిలో బరోడా రెండో విజయం సాధించగా.. పంజాబ్ రెండో ఓటమి చవిచూసింది.



