నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసుకు చెంది చేసేదేమీ లేక ఎటుతోయని పరిస్థితిలో కలెక్టర్ కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిరసన వ్యక్తం చేసిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యాప్రాల్ గ్రామానికి చెందిన చెందిన అగ్గి రెడ్డి అనే వ్యక్తి 2005 సంవత్సరంలో బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి గ్రామంలో తడకపల్లి అగ్గి రెడ్డి అనే వ్యక్తి 340,345,346 సర్వే నెంబర్లలో సుమారు రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.
అప్పటి ప్రభుత్వం పాస్ బుక్కులను జారీ చేసింది. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి అనేటువంటి చట్టాన్ని తీసుకురాగా, అప్పటినుంచి ఇప్పటివరకు కొనుగోలు చేసిన భూమి ధరణి లో ఎక్కించకపోవడంతో పాస్బుక్కులు రాలేదు. అప్పటినుంచి ఇప్పటివరకు తిరుగుతూ అధికారులపై విసుకు చెంది యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి జరుగుతున్న సందర్భంలో తమ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిరసన వ్యక్తం చేశాడు. పెట్రోల్ పోసుకున్న సందర్భంలో వెంటనే పోలీసులు స్పందించి అతన్ని సముదాయించారు.
ఏమి జరిగిందని కలెక్టర్ విషయం ఆరా తీయగా బొమ్మలరామారం మండలం నాగినేని పెళ్లి గ్రామంలో కొనుగోలు చేసిన రెండున్నర ఎకరాల భూమిని తాసిల్దార్ పట్టాదారు పాసుపుస్తకం ఎక్కించడం లేదని, తమ పేరు మీద ఉన్న భూమిని సింగిరెడ్డి మైపాల్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కించారని ఆరోపించారు. నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా ఇతరుల పేరు మీద తమ భూమిని ఎలా చేస్తారని అధికారులను నిలదీశారు. ఇప్పటికైనా అధికారులు తమకు స్పందించి న్యాయం చేయాలని కోరారు.