– 3 వేల మంది లబ్ధిదారులు…
– హాజరు మాత్రం వెలవెల
– అశ్వారావుపేట రైతు వేదికలో ఖాళీ కుర్చీ లే దర్శనం
– ప్రభుత్వ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులే డుమ్మా
నవతెలంగాణ – అశ్వారావుపేట
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతు ఉత్సవాలు అశ్వారావుపేట లో నిరాశాజనకంగా మారాయి.రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేసినప్పటికీ అశ్వారావుపేట రైతు వేదికలో మాత్రం స్పందన లేకపోవడం గమనార్హం.
వ్యవసాయ శాఖ అధికారులు వారం రోజులుగా ప్రచారం చేసినప్పటికీ రైతులు కార్యక్రమానికి ఆసక్తి చూపలేదు.సుమారు 3 వేల మంది రైతులు లబ్ధి పొందనున్నప్పటికీ కార్యక్రమానికి పట్టుమని 10 మంది రైతులు కూడా హాజరు కాకపోవడం ప్రభుత్వ కార్యక్రమాలపై రైతుల నిరాసక్తతను ప్రతిబింబిస్తోంది.
అధికారిక కార్యక్రమం అయినప్పటికీ స్థానిక కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు కూడా పెద్దగా పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. కార్యక్రమానికి ఏడీఏ పెంటేల రవి కుమార్, ఎంఏఓ పర్స శ్రీనివాస్ రావు, ఆత్మ (బీఎఫ్ఏసీ) చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తుమ్మ రాంబాబు, నాయకులు ఆల్ల నాగేశ్వరరావు, నారంవారిగూడెం సర్పంచ్ మనుగొండ నాగమణి, 22 వ వార్డు కౌన్సిలర్ దివాకర్ తో పాటు నలుగురైదుగురు యువకు మాత్రమే హాజరయ్యారు.
రైతులకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలకు కూడా హాజరు లేకపోవడం గ్రామీణ స్థాయిలో సమన్వయం లోపాన్ని సూచిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రచారం మాత్రమే కాక రైతులతో ప్రత్యక్ష సంబంధాలు పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


