Friday, May 30, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుసాగుకు రైతులు సన్నద్ధం

సాగుకు రైతులు సన్నద్ధం

- Advertisement -

– ప్రయివేటు విత్తనాలే శరణ్యం
– అరకలు అరకొరే…అన్నీ యంత్రాలే
– అదనంగా రైతులపై కిరాయిల భారం
– ముందస్తు వానలతో అదును

ఈసారి 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం
రాష్ట్రమంతటా వానలు కురుస్తుండడం దున్నడానికి నేల అనుకూలంగా మారడంతో రైతులు సాగుకు సన్నద్ధం అవుతున్నారు. ‘రోహిణీ కార్తెలో రోళ్లు పగిలేలా ఎండలు దంచికొడతాయి’ అని నానుడి. కానీ ఈసారి ముందుగానే వానలు పడుతుండటంతో రైతులు దుక్కులను సిద్ధం చేసుకుంటున్నారు.
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

గతంలో తొలకరి జల్లుల పలకరింపుతో రైతులు అరకలతో దుక్కులకు సిద్ధమయ్యేవారు. మారిన పరిస్థితుల్లో ఎక్కడా అరకలు కనిపించడం లేదు. మెజార్టీ రైతులు యంత్రాలతోనే సాగు చేస్తున్నారు. పత్తి కర్ర తొలగించడం, దున్నడం, సాళ్లు కొట్టడం, విత్తనాలు వేయడం, మందులు కొట్టడం, మాడులను చదును చేయడం, వరి నాట్లు వేయడం, కోయడం, నూర్పిడి చేయడం… ఇలా అన్ని పనులూ యంత్రాలతోనే చేస్తున్నారు.
వరి తర్వాత పత్తే అధికం
రాష్ట్రంలో వరి తర్వాత పత్తి పంట ఎక్కువగా సాగవుతుంది. ఈసారి 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రత్యామ్నాయ పంటలను సర్కారు ప్రోత్సహించక పోవడంతో రైతులంతా పత్తి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. కొన్ని చోట్ల మొక్కజొన్న, జొన్న పంటలు సాగు చేస్తారు. గతంలో ఆహార పంటలకు ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు వాణిజ్య పంటలకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రభుత్వం పత్తి విత్తనాలను సరఫరా చేయడం లేదు. దీంతో రైతులు ప్రయివేటు కంపెనీల దగ్గరే కొనాలి. చాలా గ్రామాల్లో విత్తనాలు, పురుగు మందులను ఉద్దెర ఇచ్చిన వ్యాపారులే పత్తిని కూడా కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు మోసపోయిన సందర్భాలెన్నో ఉన్నాయి.ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిలాల్లో దుక్కులు దున్నడం జోరుగా సాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో అధిక వర్షాలతో నేల బురదమయం కాగా అక్కడ దున్నడం ఆలస్య మవుతుందని రైతులు చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో పత్తి విత్తనాలను విత్తుతున్నారు. నేల కొంచెం పదును ఉన్నా… పొడి దుక్కుల్లో కూడా విత్తనం విత్తుతు న్నారు. వానలు పడగానే విత్తనం మొలకెత్తుతుందని రైతులు ఈ విధంగా చేస్తారు. కొన్నిసార్లు వానలు పడటం ఆలస్యమైతే ఎండలకు మొలకలు ఎండిపోయి, మళ్లీ విత్తనం పెట్టాల్సిన ఉదాహరణలున్నాయి. అందుకే నేల పూర్తిస్థాయిలో తడిసిన తర్వాతే విత్తనం విత్తాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
ట్రాక్టర్‌కు గంట లెక్క కిరాయి
రైతులకు సాగు భారంగా మారుతోంది. ఒక గంటకు ఒక ట్రాక్టర్‌ ఎకరా పొలాన్ని దున్నుతుంది. దానికి కిరాయి రూ. 1000 నుంచి రూ.1200 వరకు ఉన్నది. రెండు సాళ్లు దున్నితే రూ. 2400 వరకు ఖర్చవుతోంది. రాష్ట్రంలో అన్ని చోట్ల దాదాపు ఇదే విధమైన కిరాయి తీసుకుంటున్నారు. ఈసారి గంటకు కిరాయి రెండు వందలు పెంచినట్టు రైతులు వాపోతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో ట్రాక్టర్‌, వరి కోత మిషన్ల కిరాయిలు కూడా పెంచేశారు. ప్లవ్‌ (లోతుగా దున్నడం), రోటవేటర్‌ (చదును చేయడం) కిరాయిలూ అధికంగా ఉంటున్నాయి. మార్కింగ్‌ (పత్తి సాళ్లు) చేసేందుకు కూడా వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు.

నకిలీ పత్తి విత్తనాలపై నిఘా పెట్టాలి
ముందస్తుగా వానలు పడుతున్నాయి. రైతులు దుక్కులు దున్నుతున్నారు. ఈ సమయంలో నకిలీ పత్తి విత్తనాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం వీటిపై నిఘా పెట్టాలి. అధిక వర్షాలకు పంటలకు తెగుళ్లు ఎక్కువగా సోకుతాయి. పత్తికి ప్రత్నామ్నాయ పంటలను ప్రభుత్వం ప్రోత్సహించడం లేదు. అరకలు లేవు. యంత్రాల అవసరం ఉంది. కానీ యంత్రాలను రైతులకు అందుబాటులోకి తేవడం లేదు. దీంతో ట్రాక్టర్ల కిరాయిలతో రైతులపై తీవ్రమైన భారం పడుతోంది.
– మదనపు రవీంద్ర, రైతు, బల్లెపల్లి, ఖమ్మం అర్బన్‌

విత్తనాలు అందుబాటులో లేవు
వానాకాలం సీజన్‌ వచ్చింది. దుక్కులు జోరుగా సాగుతున్నాయి. వానాలు పడగానే విత్తనం అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్టు క్షేత్రస్థాయిలో విత్తనాలు అందుబాటులో లేవు. రైతులు వ్యాపారుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. యంత్రాల కిరాయిలు కూడా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో యంత్రాలను ఇవ్వాలి. మా ప్రాంతంలో పత్తి, మొక్కజొన్న పంటలు వేస్తారు. అత్యధికంగా పత్తి సాగు చేస్తారు.
– మధు, యువ రైతు, మిడ్జిల్‌, నాగర్‌కర్నూల్‌

దుక్కులకు అనుకూలంగా లేదు
వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాల్లో పొలాలు బురదగా ఉండటంతో దుక్కులకు అనుకూలంగా లేదు. వానలు తగ్గిన తర్వాత వారం రోజులకు దుక్కులు ప్రారంభమవుతాయి.ఈ ప్రాంతంలో ఎక్కువగా పత్తి సాగు చేస్తారు. వ్యవసాయమంతా ట్రాక్టర్లతో జరుగుతున్నది. కూలీల కొరత బాగా ఉన్నది. ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వస్తున్నారు.
– రమాకాంత్‌, రైతు, ఆదిలాబాద్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -