- Advertisement -
- సొసైటీ కార్యాలయాల ఎదుట ధర్నాలు
నవతెలంగాణ-విలేకరులు
యూరియా కోసం రైతుల ఆందోళనలు రోజూ కొనసాగుతూనే ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఉప్పల్వాయి సొసైటీ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. 420 బస్తాల యూరియా మాత్రమే ఉండటం పలు గ్రామాల నుంచి దాదాపు 1000 మంది రైతులు వరుసలో నిలబడటంతో ఒక బస్తా కూడా అందని పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆందోళన చేపట్టారు. మరో లోడు వచ్చేవరకూ పంపిణీ చేయొద్దని, ఒక్కో రైతుకు రెండు బస్తాలు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. వరి పంట పొట్టదశ దాటి పోతుందని, దిగుబడి తగ్గే ప్రమాదం ఉన్నందున, ప్రభుత్వం వెంటనే రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మరో లోడు యూరియాను త్వరలో తెప్పించి అందిస్తామని అధికారులు హామీనివ్వడంతో ధర్నా విరమించారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం దగ్గర రాత్రి రెండు గంటల నుంచి రైతులు లైన్ కట్టారు. రెండు లారీల యూరియా వచ్చినా అందరికీ అందలేదు. ఆగ్రహంతో రైతులు ధర్నా చేశారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలోని గ్రోమోర్ వద్ద ఉదయం 5గంటల నుండే రైతులు బారులు తీరారు. ఆ తర్వాత రాస్తారోకో చేశారు. స్థానిక ఎస్ఐ నాగరాజు ఘటనా స్థలానికి వచ్చి నచ్చజెప్పారు. కూపన్లు ఇచ్చి లైన్లో నిలబెట్టి రైతుకు ఒక్క బస్తా చొప్పున పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్, దండేపల్లి, కోటపల్లి, చెన్నూర్ మండలాల్లో రైతు వేదికల వద్దకు రైతులు యూరియా కోసం పెద్దఎత్తున తరలివచ్చారు. జైపూర్లో తెల్లవారుజామున నుంచే పడిగా పులు కాశారు. చెన్నూర్లో రైతులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపం లో రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. దండేపల్లిలో సహకార కేంద్రం వద్ద పట్టా పాసుపుస్తకాల జిరాక్స్్ కాపీలను లైన్లో పెట్టారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో పీఏసీఎస్ బ్యాంకు ముందు నర్సాపూర్, తూప్రాన్ ప్రధాన రహదారిపైనా, చేేగుంట పట్టణ కేంద్రంలో మెదక్ రోడ్డు గాంధీ చౌరస్తా లోనూ రైతులు ధర్నా చేశారు. మాసాయిపేట మండలం కేంద్రంలో 44 జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్కి సుమారు 1160 యూరి యా బస్తాలు రావడంతో రైతులు వేకువ జామునే లైన్లో నిలబడ్డారు.
- Advertisement -