– యూరియా కోసం కష్టాలు
నవతెలంగాణ- విలేకరులు
యూరియా కోసం రైతులు తెల్లవారకముందే పీఏసీఎస్, ఇతర కార్యాలయాలకు చేరుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయమే పీఏసీఎస్ల వద్ద బారులు తీరారు. ఆధార్ కార్డుకు రెండు బస్తాల చొప్పున ఇస్తుండటం, అది ఏ మాత్రం సరిపోకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నందిగామ మండల పరిధిలోని మేకగూడ పీఏసీఎస్ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు ఎగబడ్డారు. 450 యూరియా బ్యాగులు మాత్రమే అందుబాటులో ఉండటంతో పోలీసు పహారా మధ్య పంపిణీ చేశారు. రైతులు ఎగబడటంతో తొక్కిసులాట జరిగింది. దాంతో అధికారులు యూరియా పంపిణీ నిలిపివేశారు. అనంతరం 260 మంది రైతులకు టోకెన్లు అందజేశారు.
ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం యూరియా లోడ్ రావడంతో స్టాక్ ఉన్నంత వరకు పంపిణీ చేశారు. కందుకూరు పీఏసీఎస్ వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు. వచ్చిన లోడ్ను రైతులకు పంపిణీ చేయగా.. సరిపోకపోవడంతో మిగతా వారికి టోకెన్లు ఇచ్చి పంపించారు. సహకార కేంద్రాన్ని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి సందర్శించారు.
రోడ్డెక్కిన రైతులు
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రైతు సేవ సహకార సంఘం కార్యాలయం ముందు రైతులు ఉదయం 8 గంటల నుంచి లైన్లో ఉన్నారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో సహకార సంఘం సీఈవో సత్యనారాయణ రెడ్డి వచ్చి లారీ లోడ్ రావడం లేదని, రేపు సాయంత్రం వరకు యూరియా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వీలును బట్టి రైతు ఒక్కంటికి ఒకటి, రెండు బస్తాలు ఇస్తామని ప్రకటించారు. దీంతో రైతులు సీఈఓతో ఘర్షణకు దిగారు. పాలకుర్తి ఏవో శరత్చంద్రకు రైతు సంఘం నాయకులు ఫిర్యాదు చేసి సమస్యను పరిస్కరించాలని కోరారు. మహూబాబాద్ జిల్లా తొర్రూరు జాతీయ రహదారిపై రైతులు బైటాయించి ధర్నాకు దిగారు. దీంతో గంటపాటు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు సముదాయించడంతో రైతులు ధర్నా విరమించారు.
నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలోని సొసైటీ యూరియా కేంద్రం వద్ద రైతులు క్యూలో పడికాపులు కాశారు. ఒక్కలోడు 400 బస్తాలకు కాను 300 మందికి పైగా రైతులు బారులు తీరారు. రైతులు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు గొడవ జరగకుండా చర్యలు చేపట్టారు.