444 యూరియా బస్తాలకు సుమారు 500 మంది రైతులు
నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల కేంద్రంలో శనివారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ముందు యూరియా కోసం రైతులు తెల్లవారేసరికి బారులు తీరారు. వచ్చింది 444.. సుమారు 500 మంది రైతులు యూరియా కోసం క్యూ లైన్ లలో నిలబడ్డారు. ఏ రైతును కదిలించిన యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నామని, గతంలో ఎప్పుడూ ఇలాంటి దుస్థితి రాలేదని అంటున్నారు.
ప్రతి రైతు ప్రభుత్వ పాలనను దుయ్యబడుతున్నారు. బ్యాంకు సీఈఓ తిరుపతి, సిబ్బంది, ఇంకా ఎస్ఐ కమలాకర్ పోలీసులు రైతులకు నచ్చ చెప్పలేక ఒకింత ఇబ్బందులకు గురయ్యారు. అయినా పంపిణీ పూర్తి అయ్యేవరకు ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా పంపిణీని పూర్తి చేయించారు. మళ్లీ సాయంత్రం ఒక లారీ వస్తుందని, మరుసటి రోజు మరో రెండు మూడు లారీలు వస్తే సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశాభావాన్ని అటు అధికారులు, ఇటు రైతులు వ్యక్తం చేశారు. అన్న పానీయాలు లేక ఎండలో ఈ ఇబ్బందులు ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.