నవతెలంగాణ – మద్నూర్
సేంద్రీయ వ్యవసాయం (నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్) పై రైతులకు అవగాహన సదస్సును మండల కేంద్రంలోని రైతు వేదిక యందు నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి రాజు తెలిపారు. ఈ పథకం గురించి ఏవో రాజు అవగాహన కల్పిస్తూ గ్రామీణ రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం, మట్టి ఆరోగ్యాన్ని పరిరక్షించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పథకం పై రైతులకు నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సహజ వనరుల ఆధారిత వ్యవసాయం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. ముఖ్యంగా సహజ వ్యవసాయ విధానాలు, జీవామృతం మరియు ఘనజీవామృతం తయారీ విధానాలు, దేశీ ఆవుల ప్రాముఖ్యత, మట్టిలో సూక్ష్మజీవుల పాత్ర, పంట వ్యయాలు తగ్గించి లాభాలు పెంచుకునే మార్గాలు వంటి అంశాలపై రైతులకు మండల వ్యవసాయ అధికారి రాజు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ పి వో చైర్మన్ గోపాల్, ఏఈ వో సౌమ్య, మద్నూర్ గ్రామ రైతులు పాల్గొన్నారు.



