Saturday, June 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరైతులు సంఘటితంగా ఉద్యమించాలి

రైతులు సంఘటితంగా ఉద్యమించాలి

- Advertisement -

– ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వాలు విఫలం
– తెలంగాణ రైతు సంఘం ములుగు జిల్లా మహాసభలో
– రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు
నవతెలంగాణ-గోవిందరావుపేట

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతులు సంఘటితంగా ఉద్యమించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. గురువారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలోని పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో తెలంగాణ రైతు సంఘం జిల్లా 2వ మహాసభను నిర్వహించారు. ముందుగా గోవిందరావుపేటలో రైతులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. అనంతరం పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో సంఘం సీనియర్‌ నాయకులు గుండు సత్యనారాయణ జెండావిష్కరణ చేశారు. చిట్టెం ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన మహాసభలో పోతినేని మాట్లాడారు. పార్లమెంట్‌లో గిట్టుబాటు ధర చట్టం కోసం రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా కేంద్రం కన్నెత్తి చూడటం లేదని ఆరోపించారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలను రద్దుచేసి నూతన జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌ ముసాయిదా పేరుతో కార్పొరేట్లకు అనుకూలంగా చట్టం తెచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం ద్వారా రైతుల భూ కమతాలను కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి పూర్తిగా అమలుచేయలేకపోయి ందని ఆరోపించారు. రైతులు కాస్తు చేస్తున్న భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తానని చెప్పి అధికారంలోకి రాగానే మోసం చేశారని అన్నారు. జిల్లాలో వడగండ్ల వాన పడి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని, వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌చేశారు. నకిలీ విత్తనాలతో మొక్కజొన్న రైతులు నష్టపోయారని, వారికి ఎకరాకు లక్ష రూపాయలు చెల్లించాలని కోరారు. జిల్లాలో సాగునీటి సౌకర్యం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. జిల్లాలో ఇంకా 40 వేల ఎకరాల పోడు భూములకు హక్కుపత్రాలు ఇవ్వలేదని, సర్వే చేసి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ మహాసభలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా నాయకులు తుమ్మల వెంకట్‌ రెడ్డి, ఎండీ గఫూర్‌ పాషా, తీగల ఆదిరెడ్డి, పొదిళ్ల చిట్టిబాబు, సోమ మల్లారెడ్డి, గుండు లెనిన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -