లక్షల కోట్లు కొల్లగొట్టేందుకే మూసీ ప్రక్షాళన : బీఆర్ఎస్వీ నేతల రౌండ్టేబుల్ సమావేశం
నవతెలంగాణ-బంజారాహిల్స్
తెలంగాణలో ఫాసిస్టు పాలన నడుస్తోందని, లక్షల కోట్లు కొల్లగొట్టేందుకే మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారని బీఆర్ఎస్వీ నేతలు ఆరోపించారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు నిధులు లేవుగానీ, వేల కోట్లు ఖర్చు చేసి మూసీ ప్రక్షాళన చేసేందుకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ‘మూసీ సుందరీకరణ పేరుతో లక్ష కోట్ల ప్రజాధనం దోపిడీ’ని వ్యతిరేకిస్తూ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవన్ కుమార్, ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, ఉన్నత విద్యాశాఖ మాజీ చైర్మెన్ లింబాద్రి, ఓయు మాజీ వీసీ రవీందర్ యాదవ్, బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ కిషోర్ గౌడ్, ప్లానింగ్ కమిషన్ మాజీ చైర్మెన్ ప్రకాష్రావు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణలో కేవలం పదివేల ఇండ్లు మాత్రమే డ్యామెజ్ అవుతున్నాయని సీఎం రేవంత్రెడ్డి అబద్దపు ప్రకటనలు చేశారని, ఇందులో లక్షలాది మంది నిర్వాసితులుగా మారే ప్రమాదం ఉందని అన్నారు. కాంగ్రెస్ ఫాసిస్టు పాలనలో లక్షల కోట్లు వెనకేసుకునేందుకే ప్రత్యేక ప్రణాళికను రూపొందించిందని ఆరోపించారు. రెవెన్యూ శాఖను పొంగులేటికి ఇవ్వటం వెనుక భూములు కొల్లగొట్టే పక్కా ప్లాన్ ఉందన్నారు. ఇండిస్టీ అభివృద్ద్ధి కోసం కేసీఆర్ 16 వేల ఎకరాలు సమీకరిస్తే దాన్ని ఫ్యూచర్ సిటీ కింద మార్చి.. రియల్ ఎస్టేట్ కోసం 3200 ఎకరాలు మూసీ సుందరీకరణ పేరుతో సమీకరిస్తున్నారని ఆరోపించారు.
ఏండ్ల్ల తరబడి మూసీ తీరంలో నివాసాలు ఏర్పరచుకున్న స్థానికులను ఎక్కడికి పంపిస్తారని ప్రశ్నించారు. పేదల ఇండ్లు కూల్చడం కాదనీ, పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ చేస్తున్న కబ్జాలు ఆపాలనీ డిమాండ్ చేశారు. 12 ఎకరాల్లోని గడ్డం వివేక్ ఫామ్హౌస్ని కూల్చాలని సవాల్ విసిరారు. ప్రధాని మోడీ చేసిన నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్నట్టే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతో చేస్తున్న దోపిడీ ప్రాజెక్టును వెనక్కి తీసుకోక తప్పదని హెచ్చరించారు. వెలుగుమట్లలో వేల ఎకరాలు ఆక్రమించి.. మరోవైపు పేదలపై కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.



