అమెరికా అనుమతి కోసం ఆగలేం : ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ
టెల్ అవీవ్, టెహరాన్ : వరుసగా 8వ రోజైన శుక్రవారం కూడా ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతునే వున్నాయి. ఇరాన్లోని అణు కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ భీకరంగా దాడులకు పాల్పడుతోంది. మరోవైపు ఇజ్రాయిల్లోని బీర్షబన్ ప్రాంతంలో ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక భవంతులు మంటల్లో చిక్కుకున్నాయి. ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇరాన్ అణు, మిలటరీ స్థావరాలే లక్ష్యంగా దాడులకు తెగబడాలని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అణు స్థావరాలపై దాడులు చేసేందుకు అమెరికా అనుమతి కోసం ఎదురుచూసే పని లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ ప్రభుత్వ సంస్థలు, కేంద్రాలు, మౌలిక వసతులు, ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా దాడులను మరింత ఉధృతం చేయాల్సిందిగా ఇప్పటికే ఐడిఎఫ్కు ఆదేశాలు వెళ్ళాయి. ఈ మేరకు ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కట్జ్కు కూడా కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమంతో సంబంధమున్న అన్ని అణు కేంద్రాలు, స్థావరాలు, శాస్త్రవేత్తలపై దాడులు కొనసాగించాల్సిందిగా ఆదేశించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న లక్ష్యాలకు అదనంగా వీటిని కూడా చేపట్టాలని కోరారు. రాజధాని టెహరాన్లో ప్రభుత్వ కేంద్రాలపై దాడులను ఉధృతం చేయాలని మిలటరీని ఆదేశించినట్లు రక్షణ మంత్రి కట్జ్ చెప్పారు. బసిజ్ (మిలీషియా), రివల్యూషనరీ గార్డ్ వంటి ప్రభుత్వ అధికార కేంద్రాలను దాడులతో అస్థిరపరచాలని కట్జ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జెనీవాలో దౌత్య ప్రయత్నాలు
మరోవైపు యుద్ధాన్ని ఆపేందుకు తీసుకోవాల్సిన దౌత్య చర్యలు, నిర్ణయాలపై చర్చించేందుకు జెనీవాలో యురోపియన్ విదేశాంగ మంత్రులు ఇరాన్ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతున్నారు. బ్రిటీష్ విదేశాంగమంత్రి డేవిడ్ లామీ జర్మనీ, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులతో కలిసి ఇరాన్ విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారు. రాబోయే రెండు వారాల్లో దౌత్య పరిష్కారాన్ని కనుగొనడానికే ఈ ప్రయత్నాలన్నీ అని డేవిడ్ వ్యాఖ్యానించారు.
యుద్ధ నేరాలే !
కాగా ఇప్పటికే జెనీవా వెళ్ళిన అబ్బాస్ అక్కడ మానవ హక్కుల మండలి సమావేశంలో మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి నిబంధనావళిలో ఆర్టికల్ 2ను ఉల్లంఘించి ఇజ్రాయిల్ ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే, అత్యంత ఆటవికంగా దాడులకు, దూకుడు చర్యలకు పాల్పడిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ విమర్శించారు. ఇవన్నీ కూడా యుద్ధ నేరాలేనని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ ఆ దాడులను సమర్ధవంతంగా తిప్పికొడుతోందని చెప్పారు. విధుల్లో లేని సైనిక సిబ్బంది, సామాన్య పౌరులపై కూడా అత్యంత విచక్షణారహితంగా దాడులు జరపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే యుద్ధం జరుగుతున్నందున ఇక అమెరికాతో అణు చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పారు. ఈ యుద్ధం ఆగనంత కాలం అమెరికాతో చర్చలు జరగవని స్పష్టం చేశారు. దౌత్యానికి, చర్చలకు తావు లేదని అన్నారు. ఇదిలావుండగా, ఇరాన్పై జరిగే దాడుల్లో ఇజ్రాయిల్తో అమెరికా చేతులు కలపాలా వద్దా అనే విషయమై అధ్యక్షుడు ట్రంప్ రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని వైట్హౌస్ వెల్లడించింది.
ఇరాన్లో ప్రభుత్వ మార్పు ఆమోదయోగ్యం కాదు : క్రెమ్లిన్
ఇరాన్లో ప్రభుత్వ మార్పు గురించి చర్చ జరగాలన్న ఆలోచన ఆమోదయోగ్యం కాదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్ శుక్రవారం స్పష్టం చేశారు. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా వున్నాయనీ, ఇలాంటి పరిస్థితుల్లో పాలనా మార్పు ఆ ప్రాంతానికే కాదు, మొత్తంగా ప్రపంచ సుస్థిరతకు కూడా ముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించారు.
30శాతం కన్నా తక్కువ క్షిపణులే వాడాం
ఇజ్రాయిల్పై ఇప్పటివరకు దాదాపు 400 క్షిపణులు, 600 డ్రోన్లు ప్రయోగించినట్లు ఇరాన్ తెలిపింది. ఇరాన్ జనరల్ మోసెన్ రెజాయి ఈ విషయాన్ని ప్రకటిస్తూ, ఇరాన్ వద్ద గల మొత్తం క్షిపణి సామర్ధ్యంలో 30శాతం కన్నా తక్కువే ఉపయోగించినట్లు తెలిపారు. మొత్తం తమ సామర్ధ్యంలో ఇది 5శాతం కూడా లేదని అన్నారు. త్వరలోనే కొత్త క్షిపణి సామర్ధ్యాలు వెల్లడవుతాయని ఆయన ప్రకటించారు.
సంయమనం కావాలి : బ్రిటన్ ప్రధాని
ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగడం ఎవరి ప్రయోజనాలకూ మంచిది కాదని బ్రిటీష్ ప్రధాని స్టార్మర్ వ్యాఖ్యానించారు. ఇలాంటపుడు సంయమనం అవసరమని స్పష్టం చేశారు.
భారతీయుల తరలింపు
ఇరాన్ నుండి శుక్రవారం రాత్రి మరో మూడు విమానాల్లో వెయ్యి మందికి పైగా భారతీయులను తీసుకుని వస్తున్నట్లు ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ జావేద్ హుస్సేన్ తెలిపారు. ఆ విమానాల కోసం ఇరాన్ తన గగనతలాన్ని అనుమతించింది. శనివారం తెల్లవారు జామునకు ఈ విమానాలు ఢిల్లీలో ల్యాండ్ అవుతాయని
భావిస్తున్నారు.