ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
విద్యార్థులు, కళాశాలల అధ్యాపకుల ర్యాలీలు
నవతెలంగాణ-విలేకరులు
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్కు భరోసా ఇవ్వాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులు పెద్దఎత్తున ర్యాలీల్లో పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఈసీఐఎల్లో ఎస్ఎఫ్ఐ కాప్రా మండల కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు.ఖమ్మంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వివిధ కాలేజీల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్ఆర్అండ్బిజిఎన్ఆర్ కళాశాల గ్రౌండ్ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తుడుం ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇటికాల రామకృష్ణ, పిడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరి వెంకటేష్, జార్జిరెడ్డి, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ మాట్లాడారు. విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దన్నారు. ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే మంత్రుల ఇండ్లు ముడ్డిస్తామని హెచ్చరించారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో ప్రయివేటు కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి నిరసన చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లపాటు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ చెల్లించకుండా యాజమాన్యాలు, విద్యార్థులను ఆగం చేసిందని అన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జన్నారంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కళాశాల ఎదుట నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని స్థానిక వాగ్దేవి డిగ్రీ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆర్డీఓ అనంతరెడ్డి పాల్గొన్న ప్రజాదర్బార్ను విద్యార్థులు ముట్టడించారు. మండల పరిషత్ కార్యాలయం ఎదుట కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అంతకు ముందు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, వినతిపత్రాలు అందజేశారు. విద్యార్థులు నినాదాల హౌరుతో ప్రభుత్వ కార్యాలయాలు దద్దరిల్లాయి.
ఫీజు బకాయిలపై పోరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES