– వార్డులవారీగా ఫొటోలతో ఓటర్లిస్టు
– ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు షెడ్యూల్
– ఈ నెల 6 నుంచి 8 వరకు అభ్యంతరాల స్వీకరణ
– 8న ఆయా పార్టీల నాయకులతో సంయుక్త సమావేశాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఎప్పుడు నోటిఫికేషన్ విడుదలైనా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నది. అందులో భాగంగానే డీపీఓల ఆదేశాల మేరకు అన్ని పంచాయతీల్లోనూ ఓటర్ల తుది జాబితాను పంచాయతీ కార్యదర్శులు మంగళవారం అందుబాటులో ఉంచారు. గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఫొటో గుర్తింపుతో ఉన్న తుది ఓటర్ లిస్టులను అందుబాటులో ఉంచింది. ఆగస్టు 28 నుంచి 30వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించిన విషయం విదితమే. వాటిపై ఆగస్టు 31న డీపీఓలు అభ్యంతరాలకు పరిష్కారం చూపారు. మరోవైపు పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బ్యాలేట్ బాక్సులు, ఇంకు బాటిల్లను సిద్ధం చేసింది. పోలింగ్ కేంద్రాలను గుర్తించింది. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఓటర్ల జాబితాను ప్రదర్శించాలని సూచించింది. షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ/జెడ్పీటీసీల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 9న ప్రదర్శించాలని అధికారులకు సూచించింది.కలెక్టర్ల ఆమోదంతో ఎంపీడీఓ, ఏడిఈఏఎస్ ద్వారా పోలింగ్ స్టేషన్ల జాబితాను తయారు చేసి ప్రచురించాలని సూచించింది. జిల్లా ఎన్నికల అధికారులు జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో, మండల స్థాయిలో ఎంపీడీఓలు ఏడిఈఏఎస్ ద్వారా ఈ నెల 8న సమావేశం నిర్వహించాలని పేర్కొంది. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలను ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు స్వీకరించాలని సూచించింది. అభ్యంతరాలు, సూచనలుంటే తొమ్మిదో తేదీ వరకు పరిష్కరించాలని స్పష్టం చేసింది. పోలింగ్ స్టేషన్ల వారీగా తుది జాబితాను పదో తేదీన ప్రచురించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.