– ఊపిరాడక 17 మంది మృతి
– చార్మినార్ సమీపంలో అత్యంత హృదయ విదారక ఘటన
– చనిపోయినవారంతా బంధువులే.. సంఘటనా స్థలంలో ముగ్గురు, చికిత్సపొందుతూ 14 మంది మృతి..
– వారిలో 8 మంది చిన్నారులు, 9 మంది పెద్దలు, వృద్ధులు
– ఏసీ కంప్రెషర్ పేలి కిందంతస్తులో మంటలు
– తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లిన సహాయక సిబ్బంది
– రోబోతో మంటలు అదుపులోకి..
– కుట్రకోణం లేదన్న పోలీసులు
– ఒక్కొక్కరికి రూ. ఐదులక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..
– ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం
– ఘటనా స్థలిని సందర్శించిన కేంద్ర, రాష్ట్రమంత్రులు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
– తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పీఎం మోడీ, సీఎం రేవంత్రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, ఏఐసీసీ నేత రాహుల్గాంధీ తదితరులు
ఓ అరగంట అయితే అందరూ నిద్రలేస్తారు. కానీ ఏసీ కంప్రెషర్ రూపంలో 17 మందిని మృత్యువు చుట్టేసింది. వారిలో అభంశుభం తెలియని చిన్నారులూ ఉన్నారు. బయటకు రావాల్సిన మెట్ల వద్దే అగ్నిప్రమాదం జరగడంతో లోపలివాళ్లు ఎటూ కదల్లేకపోయారు. పొగకు ఊపిరాడక చిన్నారులు నిద్రలోనే కన్నుమూసారు. అప్పుడప్పుడే తెల్లవారుతుండటంతో ట్రాఫిక్ సమస్య లేదు. ఫైరింజన్లు సకాలంలో వచ్చినా, ప్రాణాల్ని కాపాడలేకపోయాయి. అయితే ప్రమాద విస్తరణను నియంత్రించగలిగాయి. ఈ ఘటనతో భాగ్యనగరం హృదయం ఉక్కిరిబిక్కిరై, దిగ్భ్రాంతికి గురైంది.
నవతెలంగాణ-సిటీబ్యూరో/ధూల్పేట్
హైదరాబాద్లోని చార్మినార్కు అతి సమీపంలో గుల్జార్హౌస్ వద్ద ఆదివారం ఉదయం చోటు చేసుకున్న అత్యంత హృదయ విదారక ఘటనలో 17 మంది అగ్నికి ఆహుతయ్యారు. 8 మంది చిన్నారులు, 5గురు మహిళలు, 4 గురు పురుషులు మృతిచెందారు. చనిపోయినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారు, బంధువులు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రధాని మోడీ, సీఎం రేవంత్ స్పందించారు. తీవ్ర దిగ్బాంత్రిని వ్యక్తం చేశారు.గుల్జార్హౌస్ సమీపంలోని జీప్లస్-2 భవనంలో మొదటి అంతస్తులో నగలు, ముత్యాల వ్యాపారులు ప్రహాల్లాద్ మోదీ, పంకజ్ మోదీ,రాజేందర్ మోదీ కుటుంబసభ్యులు నివాసముంటు న్నారు. గ్రౌండ్ఫ్లోర్లో నగల దుకాణం నిర్వహిస్తున్నారు. వేసవి సెలవులు కావడం తో వ్యాపారి బంధువులు వారి వద్దకు వచ్చారు. శనివారం రాత్రి అందరూ ఇంట్లో పడుకున్నారు. అయితే కింది అంతస్తులో ఏసీ కంప్రెషర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పైఅంతస్తులకు వ్యాపించాయి. దట్టమైన పోగ వ్యాపించడం, ఒకే మెట్ల మార్గం ఉండటంతో బయటకు వచ్చే దారి లేక భవనంలో ఉన్నవారు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యారు, అపస్మారకస్థితిలోకి వెళ్లారు. ఆదివారం ఉదయం ప్రమాదం విషయం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, జీహెచ్ఎంసీ, ఇతర విభాగం అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లేమార్గం లేకపోవడంతో నిచ్చెన సహాయంతో మొదటి అంతస్తులోకి వెళ్లారు. తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లారు. డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి ప్రమాదంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు. వారంతా అపస్మారక స్థితిలో ఉండడంతో వెంటనే వారిని అంబులెన్స్లో ఉస్మానియా, యశోద (మలక్పేట్), డీఆర్డోవో అపోలో ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో 17 మంది మతి చెందగా, పలువురు గాయాల బారిన పడ్డారు. ఉదయం దాదాపు 6గంటల సమయంలో భవనంలో ఏసీ కంప్రెషర్ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలంలోనే ముగ్గురు మతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 14 మంది మతిచెందారు. మొత్తం 17 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వారి కుటుంబసభ్యులకు, బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై అన్ని శాఖల అధికారులతో సీఏం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు మాట్లాడారు. అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదంలో కుట్రకోణం లేదని పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబాలకు కేంద్రం తరఫున సాయం అందిస్తామని కేంద్రమంతి కిషన్రెడ్డి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఘటనపై ప్రభుత్వం అధికారులను పూర్తి వివరాలు అందించాలని కోరింది. ఘటన ఎలా జరిగింది అన్న దానిపై ఆరా తీసింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరలేదన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ వివరాలను అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.
రోబోతో మంటలు అదుపులోకి..
ఆదివారం ఉదయం ఆరుగంటలకు ప్రమాదం జరిగింది. 6.16 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బందికి ప్రమాదం గురించి సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన మొగల్పుర ఫైర్ ఇంజిన్ సిబ్బంది 6.17కి బయలుదేరి 6.20గంటలకల్లా ప్రమాదస్థలికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. మొత్తం 11 ఫైర్ ఇంజినేర్లు, ఒక రోబోట్, 70 మంది ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. మంటలను ఆర్పడానికి మొత్తం 2 గంటల సమయం పట్టిందని ఫైర్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. సంఘటన విషయం తెలియగానే నిమిషాల వ్యవధిలోనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు. వారు తీవ్రంగా శ్రమించి చిక్కుకుపోయిన వారిని రక్షించారని, మంటలను అదుపులోకి తీసుకువచ్చారని చెప్పారు. ప్రమాద తీవ్రత మరింత పెరగకుండా నియంత్రించగలిగామన్నారు. క్షతగాత్రులకు మలక్పేట యశోద, ఆపోలో డీఆర్డీవో ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామని, ఫైర్ ఎగ్జిట్ లేకపోవటం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన సమాచారం తెలిసిన వెంటనేే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కేంద్రమంత్రి కిషన్రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, డీజీపీ జితేందర్, నగర మేయర్, నగర సీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్తోపాటు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, పలువురు ప్రముఖులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అధికారులను, బాధితులను సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఒక్కొక్కరికి రూ. 5లక్షల చొప్పున పరిహారం : డిప్యూటీ సీఎం
ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతులకు ఒక్కొక్కరికి రూ. 5లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్న ట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహాతో కలిసి ఆయన ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఇరుకైన మార్గంలో జీప్లస్-2 భవనానికి జీహెచ్ ఎంసీ అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారనేదానిపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారు:
ప్రహ్లాద్ (70), మున్ని (70), రాజేందర్ మోదీ (65), సుమిత్ర (60), హమేరు (7), అభిషేక్ (31), శీతల్ (35), ప్రియాన్ష్ (4), ఇరాజ్ (2), ఆరూష్ (3), రిషబ్ (4), ప్రథమ్ (1.6), అనుయాన్ ( 3), వర్ష (35), పంకజ్ (36), రజిని (32), ఇడ్డు (4).
ప్రధానితోపాటు పలువురు ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
పాతబస్తీలో ఆదివారం జరిగిన ప్రమాదం ఘటనపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఏం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్రావు,, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్తోపాటు పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గుల్జార్హౌస్లో అగ్నిప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES