– ఫైర్ సిబ్బంది సమయస్ఫూర్తితో తప్పిన పెను ప్రమాదం
నవతెలంగాణ – చర్లపల్లి/రాజేంద్రనగర్
చర్లపల్లిలోని ఐఓసీ పెట్రోలియం వద్ద ఆదివారం ఖాళీ పెట్రోల్ ట్యాంకర్ వెళ్తుండగా మంటలు చెలరేగి పక్కన ఉన్న ఫుల్ ట్యాంక్ పెట్రోల్, మరో గ్యాస్ ట్యాంకర్లకు మంటలు వ్యాపించాయి. వెంటనే ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం చర్లపల్లిలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఖాళీగా వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్కు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై ట్యాంకర్ను పక్కకు ఆపినప్పటికీ, మంటలు సమీపంలో నిలిపి ఉన్న ఓ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ట్యాంకర్, మరో గ్యాస్ ట్యాంకర్కు వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న చర్లపల్లి అగ్నిమాపక స్టేషన్ ఫైర్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భారీ ప్రమాదం అంచున నిలిచిన ఈ ఘటనలో సమయస్ఫూర్తి ప్రదర్శించిన ఫైర్ సిబ్బందిని అధికారులు అభినందించారు. ఇటువంటి ప్రమాదాలు పునరావతం కాకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. సంఘటన స్థలాన్ని ఏడీఎఫ్ఓ రంజిత్ కుమార్ పరిశీలించారు. ఫైర్ స్టేషన్ సిబ్బంది ఆదర్శ, హనుమంతు రావు, గణేష్, రామిరెడ్డి, బాబుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
మైలార్దేవ్పల్లిలో మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలోనూ పైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది.మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని మెగాల్స్ కాలనీలోని మూడు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మొదటి అంతస్తులో మంటలు వ్యాపించాయి. అందులో ఉన్న వారు వెంటనే బిల్డింగ్ మూడంతస్తుల పైకెక్కి రక్షించాలని పెద్ద ఎత్తున కేకలు వేశారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మొదటి అంతస్తులో వ్యాపించిన మంటలను అదుపులోకి తెచ్చారు. భవనంపైన ఉన్న ప్రజలను సురక్షితంగా కిందికి తీసుకుని వచ్చారు. ఈ అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్సర్క్యూటే కారణమని ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
చర్లపల్లి వద్ద పెట్రోల్ ట్యాంకర్లో మంటలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES