Sunday, June 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅగ్ని ప్రమాద ఘటనపైసిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

అగ్ని ప్రమాద ఘటనపైసిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

- Advertisement -

అగ్నిమాపక శాఖ నిర్లక్ష్యం వల్లే 17 మంది ప్రాణాలు కోల్పోయారు
ప్రభుత్వం వేసిన కమిటీ మమ్మల్ని కలవలేదు : గుల్జర్‌ హౌస్‌ అగ్ని ప్రమాద బాధిత కుటుంబసభ్యులు
నవతెలంగాణ-బంజారా హిల్స్‌

ఇటీవల హైదరాబాద్‌లోని గుల్జర్‌ హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని బాధిత కుటుంబానికి చెందిన సంతోష్‌ గుప్తా కోరారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో అగ్నిప్రమాద బాధిత కుటుంబసభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోషామహల్‌ నివాసి శ్రీనివాస్‌, న్యాయవాది అతుల్‌ అగర్వాల్‌, నితీష్‌ గుప్తాతో కలిసి ఆయన మాట్లాడారు. అగ్నిమాపక శాఖ నిర్లక్ష్యం వల్లే 17 మంది ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన గంట వరకు అగ్నిమాపక శాఖ వాహనాలు రాలేదని, వచ్చిన వాహనాల్లో సరైన సిబ్బంది, నీటి సదుపాయం లేకపోవడంతోనే మరణాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. సరైన సమయంలో ఫైర్‌ సిబ్బంది స్పందించి ఉంటే ప్రమాదంలో తమ వాళ్లను కోల్పోయే వాళ్ళం కాదన్నారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తీసుకువెళ్లిన అనంతరం ఉస్మానియా వైద్యుల నిర్లక్ష్యంతో ముగ్గురు మృతిచెందారని విచారం వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వెళ్లిన తర్వాత ఎఫ్‌ఐఆర్‌ లేకుండా చికిత్స చేయలేమని చెప్పారని అన్నారు. అలాగే ఈ ఘటనపై ప్రభుత్వం వేసిన కమిటీ ఇప్పటివరకు తమను కలవలేదని తెలిపారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ ఘటనపై జ్యూడిషియల్‌ ఎంక్వయిరీ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పట్టిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం జ్యూడిషియల్‌ ఎంక్వయిరీ ఆదేశించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఈ ఘటనపై నిర్లక్ష్యంగా మాట్లాడటం తమను తీవ్రంగా కలిచి వేస్తున్నదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -