నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ ఆసియా సంక్షోభంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం బుధవారం ఢిల్లీలో ప్రారంభమైంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి పలువురు సీనియర్ ప్రతిపక్ష నాయకులు హాజరయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పెట్రోలియం, సహజ వాయువుల మంత్రి హర్దీప్ పూరి, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
విపక్షానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ముకుల్ వాస్నిక్, తారిఖ్ అన్వర్, సమాజ్వాదీ పార్టీ నాయకులు ధర్మేంద్ర యాదవ్, జావేద్ అలీ, సీపీఐ(ఎం)కి చెందిన జాన్ బ్రిట్టాస్, ఎల్జెపికి చెందిన అరుణ్ భారతి, డీఎంకే నాయకురాలు పి. విల్సన్, ఆప్కు చెందిన సంజయ్ సింగ్ ఉన్నారు. జేడీ-యూ తరపున కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా ప్రాతినిధ్యం వహించారు. ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఏ నాయకుడూ హాజరు కాలేదు.
ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికాలు ఇరాన్పై దాడి చేశాయి. నాలుగు వారాలకు పైగా సాగిన పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఇంధన సంక్షోభానికి తెరలేపింది.



