– ఉత్పత్తి విభాగాలపై తీవ్ర ప్రభావం
– నిర్బంధ చర్యలకు దిగిన ప్రభుత్వం
– అరెస్ట్లను అడ్డుకున్న కార్మికులు
– మద్దతుగా అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల ర్యాలీ
ఉక్కునగరం : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగాకాంట్రాక్టు కార్మికులు చేపట్టిన సమ్మె తొలిరోజు విజయవంతమైంది. కాంట్రాక్టు కార్మికులకు ప్లాంటు పర్మినెంట్ ఉద్యోగులు మద్దతు తెలిపారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్బంధ చర్యలు చేపట్టినప్పటికీ కార్మికులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. మంగళవారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభం కావాల్సిన ‘ఏ’ షిష్ట్కు కార్మికులను విధులకు హాజరయ్యేలా చూడటానికి యాజమాన్యం అనేక విధాలుగా ప్రయత్నించింది. అయితే, ఈ ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేదు. షిఫ్ట్ ప్రారంభం అయినా, పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులు విధులకు దూరంగా ఉండిపోయారు. వీరికి మద్దతు తెలుపుతూ పర్మినెంట్ ఉద్యోగులు కూడా పలువురు తొలిరోజుల విధులను బహిష్కరించారు. ‘ఏ’ షిష్ట్లో 80 శాతానికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెలో భాగంగా విధులకు దూరంగా నిలిచినట్లు తెలిసింది. దీంతో ‘బి’ ‘సి’ షిఫ్ట్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం నుండి రాత్రి వరకు పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొనడం, వారికి మద్దతుగా పలువురు పర్మినెంట్ ఉద్యోగులు నిలవడంతో ఉత్పత్తి విభాగాలపై తీవ్ర ప్రభావం పడింది. కీలకమైన విభాగాల్లో నామమాత్రంగానే పనులు నడిచాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడం, పర్మినెంట్ కార్మికులపై, కార్మిక సంఘాల నాయకులపై సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులతో కక్ష సాధింపు చర్యలకు దిగడం వంటి చర్యలకు వ్యతిరేకంగా కార్మికులు ఇచ్చిన నినాదాలు, చేసిన ప్రదర్శనలతో ఉక్కునగరం మారుమ్రోగింది. సమ్మె చేస్తున్న కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల జెఎసి విశాఖ పట్నంలో భారీ ర్యాలీ, సభను నిర్వహించింది.
తెల్లవారు జామునుండే నిర్బంధం
ఉక్కు కార్మిక సంఘాలపై ప్రభుత్వం మంగళవారం తెల్లవారు జామునుండే నిర్బంధానికి పాల్పడింది. పోలీసులు ఎక్కడికక్కడ భారీగా మోహరించారు. స్టీల్ప్లాంట్ కాంట్రాక్టు లేబర్ యూనియన్ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ సహా ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు యు.సోమేష్, అప్పారావు, అప్పలరాజు, కె.వంశీ, బి.అప్పారావులను అరెస్టు చేసి ్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
తొలి రోజు’ఉక్కు’ సమ్మె సక్సెస్
- Advertisement -
- Advertisement -