నేడు రైతు ఖాతాల్లో జమ
మొదట విడతలో ఎకరా వరకు అందరికీ వర్తింపు
68.90 లక్షల మంది రైతులకు లబ్ది
ఏప్రిల్ రెండో వారంలో రెండో విడత రూ.2,650 కోట్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకంలో భాగంగా తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,446.94 కోట్లను విడుదల చేసింది. ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం రైతుల ఖాతాల్లో ఆ డబ్బులు జమ కానున్నాయి. అయితే, తొలి విడతలో భూమి ఉన్న ప్రతి రైతుకూ ఒక ఎకరా వరకు(మొత్తం 57,44,907.19 ఎకరాలు) మాత్రమే ఇది వర్తించనున్నది. దీంతో 68,89,955 మంది రైతులకు లబ్దిచేకూరనున్నది.
ఏప్రిల్ రెండో వారంలో రూ.2,650 కోట్లు, మూడో విడతలో రూ.2,760 కోట్లను విడుదల చేయనున్నది. రెండో విడత పూర్తయ్యే సరికి 70 నుంచి 80 శాతం రైతులకు రైతు భరోసా పూర్తికానున్నది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలోని 5,22,313 మంది రైతులకు 268.57 కోట్ల రూపాయల లబ్ది చేకూరనున్నది. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 24,935 మంది రైతులకు 10.43 కోట్లు విడుదల కానున్నాయి.




