– అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్
– త్వరలోనే ఆశా వర్కర్లకూ జీతాల పెంపు..
– ‘మిషన్ వాత్సల్య’ కింద తల్లిదండ్రులు లేని పిల్లలకు
– నెలకు రూ.4వేలు అందజేత
– ఇందిరమ్మ అమృతం ప్రారంభోత్సవ సభలో మంత్రి ధనసరి సీతక్క
– చదువు ద్వారానే ఆడపిల్లల అభివృద్ధి సాధ్యం
నవతెలంగాణ-కొత్తగూడెం
తొలి బడి అమ్మఒడి.. మలి బడి అంగన్వాడీ బడి.. అని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక్క అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘ఆడపిల్లలకు శక్తినిద్దాం.. ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఇందిరమ్మ అమృతం పథకాన్ని మహబూబాబాద్ ఎంపీ పోలిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనితా రామచంద్రన్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ, ఐటీడీఏ పీఓ రాహుల్తో కలిసి మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కౌమార బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఇందిరమ్మ అమృతం పేరిట ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. దీని ద్వారా మూడు జిల్లాల్లో 50,269 మంది బాలికలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆడపిల్లలు సరైన పౌష్టికాహారం లేక అనేక రకాల అనారోగ్యాలకు, పౌష్టికాహార లోపానికి గురవుతున్నారని తెలిపారు. దాంతో 14 నుంచి 18 సంవత్సరాల లోపు బాలికలకు ఈ ఇందిరమ్మ అమృతం పథకం ద్వారా మిల్లెట్స్తో కూడిన చిక్కీలను నెలకు రెండు ప్యాకెట్లు అందిస్తామన్నారు. ఒక్కో ప్యాకెట్లో 15 చిక్కీలు ఉంటాయని, రోజుకు ఒక చిక్కి తినడం ద్వారా ఆడపిల్లలు నెలసరి టైంలో వచ్చే సమస్యలను, రక్తహీనతను తగ్గించి, శక్తిని పెంపొంచే విధంగా పని చేస్తాయని తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మార్చామని, పిల్లలందరికీ నర్సరీ పాటలతో పాటు ఆహారం అందిస్తామని అన్నారు. ప్రయివేటు పాఠశాలకు వెళ్లి తల్లిదండ్రులు డబ్బులు వృథా చేసుకోవద్దన్నారు. అంగన్వాడీ కేంద్రాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేస్తున్నామని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఏకరూప దుస్తులను అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు ఆడుకోవడానికి 57 రకాల ఆట వస్తువులను అందుబాటులో ఉంచామన్నారు. త్వరలోనే గర్భిణులు కింద కూర్చోకుండా బల్లలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ తయారు చేసిన వేస్ట్ నుంచి బెస్ట్ చాలా ఆకర్షించిందని వాటిని రాష్ట్ర వ్యాప్తంగా చూపెడతామన్నారు. మొట్ట మొదటిసారిగా అంగన్వాడీ కేంద్రాలకు నెలరోజుల వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించిందన్నారు.
అంగన్వాడీ టీచర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నటు వంటి రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.2లక్షలు అందించడానికి ఆమోదం తెలుపుతూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంతకం చేశారని తెలిపారు. అలాగే, రాబోయే కాలంలో ఆశా వర్కర్ల జీతాల పెంపు, రెగ్యులైజేషన్ చేస్తామని తెలిపారు. ప్రభుత్వం అందించే పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ అందే విధంగా ఉద్యోగస్తులు సహకరించాలన్నారు. విద్యార్థుల అభివృద్ధికి అమ్మ, నాన్న, ఉపాధ్యాయులు ఈ ముగ్గురు మాత్రమే కీలకమన్నారు. మిషన్ వాత్సల్య పథకం కింద తల్లిదండ్రులు లేని పిల్లలకు అండగా ప్రభుత్వం నెలకు రూ.4 వేలను అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద జిల్లాకు మంజూరు అయిన రూ.74.64 లక్షల చెక్కును పిల్లలకు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. కాగా, అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రూ.2లక్షల ఆమోదానికి కృషిచేసిన మంత్రి సీతక్కను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ టీచర్లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా, జిల్లా అధికారులు, అంగన్వాడీ టీచర్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
తొలిబడి అమ్మ ఒడి.. మలి బడి అంగన్వాడీ బడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES