నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్లాగ్ షిప్ కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చొరవ చూపాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో “చేయూత పింఛన్ లపై” అవగాహన కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు , మున్సిపల్ కమిషనర్లు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, పోస్టల్ డిపార్ట్మెంట్ సిబ్బంది, సెక్షన్ ఆఫీసర్ల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పాల్గొని తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పింఛన్ల అమలులో పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రధానంగా తీసుకున్న పేదలకు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ఎంపీడీవోలు,ఎంపీ ఓలు, ఏ.ఈ.ఓ,పంచాయతీ సెక్రెటరీలు, మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి పనులు త్వరగా పూర్తి చేసుకునేలా కృషి చేయాలన్నారు. ఇంకా ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టని లబ్ధిదారుల ప్రతి ఇంటికి వెళ్లి ఇల్లు ఎందుకు కట్టుకోలేదో తెలుసుకొని ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మహిళా సంఘాల ద్వారా లోన్లు ఇప్పించి ఇంటి పనులు మొదలు చేయించాలన్నారు.
ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. ఇల్లు కట్టే మేస్త్రి లతో మాట్లాడి తక్కువ ధరతో ఒకే రేటుతో ఇల్లు కట్టేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఇసుక, చువ్వ, కంకర, ఇటుకలు , సిమెంటు తదితర మెటీరియల్ ను లబ్ధిదారులకు తక్కువ ధరకు వచ్చేలా యాజమాన్యంతో మాట్లాడి సహకరించాలన్నారు. అన్ని సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ లబ్ధిదారుల ఇళ్లు త్వరగా పూర్తి అయ్యేలా ప్రతి ఒక్క అధికారి పర్యవేక్షించి ఇండ్ల నిర్మాణపు పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు.
ఈ అవగాహనా కార్యక్రమానికి హాజరైన గోపాల్ రావు డైరెక్టర్ (పెన్షన్), టెక్నికల్ టీమ్ చేయూత పింఛన్ల అమలు విధానంపై సమగ్రమైన అవగాహన కల్పించారు. పింఛన్ల పంపిణీలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు, పోర్టల్ పరంగా తలెత్తే సమస్యల పరిష్కార మార్గాలు వివరించారు. స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్చ సర్వేక్షన్ గ్రామీణ్ 2025, వనమహోత్సవం 2025 లాంటి ముఖ్యమైన కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు , జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి ,జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి లు పాల్గొన్నారు.